యుకే రిటర్న్స్ లో మరో ఇద్దరికి పాజిటివ్..

418
corona
- Advertisement -

కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తుందన్నారు తెలంగాణ ప్రజా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జి శ్రీనివాస రావు. శనివారం ఆయన యుకే కొత్త వైరస్‌ వ్యాప్తిపై మీడియాతో మాట్లాడారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానంను అవలంబిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. యుకే నుండి వచ్చిన వారి వివరాలు సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నాము. డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు 1216 మంది యుకే నుండి తెలంగాణకు వచ్చారు. వీరిలో 970 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించాము.

ఇప్పటివరకు ఫలితాలు వచ్చిన వారిలో ఈ రోజు మరో ఇద్దరికీ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరిద్దరూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకి చెందిన వారు. మొత్తం ఇప్పటివరకు 20 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారిలో హైదరాబాద్ నుంచి నలుగురు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి ఆరుగురు, జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు పాజిటివ్‌గా ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి.

20 మందిని వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులో ఉంచాము. 20 మందికి 79 మందికి అతిసన్నిహితంగా ఉన్న వారిని గుర్తించాము, వారిని క్వారేంటిన్‌లో ఉంచి ఆరోగ్య పరిస్థితిని పరిశీలన చేస్తున్నాము. వారికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. పాజిటివ్ వచ్చిన వారందరికి సంబందించిన శాంపిల్స్ ఏ వైరస్ తెలుసుకోవడానికి జీనోమ్ సీక్వెన్స్ కోసం సీసీఎంబికి పంపించాము. మరో రెండు రోజుల్లో ఫలితాలు రానున్నాయి.

యుకె నుండి వచ్చిన వారిలో 92 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. ఆయా రాష్ట్రాలకు సమాచారం అందించాము. మరో 184 మందికి సంబందించిన వివరాలు సమగ్రంగా లేవు. వారి అడ్రస్ లు, ఫోన్ నంబర్స్ సరిగా లేవు. వారందరినీ ట్రేస్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాం.  కావున డిసెంబర్ 9 తరువాత రాష్ట్రానికి నేరుగా యుకే నుండి వచ్చిన వారు లేదా యుకే గుండా ప్రయాణించి  వచ్చిన వారు దయచేసి వారి వివరాలను 040-24651119 నంబర్ కి ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్ కి వాట్స్ ఆప్ ద్వారా అందిచాలని విజ్ఞప్తి చేస్తున్నాము.  వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వారి ఇంటికి వెళ్ళి వైద్య పరీక్షలు చేస్తారు.

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ రాష్ట్రం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ చర్యలు, ప్రజల సహకారం వల్ల వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్యను అదుపులో ఉంచగలిగాము. మున్ముందు కూడా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కొత్త రకం వైరస్‌తో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మాస్క్ తప్పని సరిగా వాడండి, భౌతిక దూరం పాటించండి, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి అని తెలంగాణ ప్రజా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జి శ్రీనివాస రావు తెలిపారు.

- Advertisement -