సివిల్స్ లో సత్తా చాటిన తెలుగు తేజాలు

647
upsc
- Advertisement -

దేశ అత్యున్నత సర్వీస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్‌సి) నిర్వహించిన సివిల్స్-2018 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన కనిశక్ కటారియా సివిల్స్‌లో మొదటి ర్యాంకు సాధించారు . ఎస్సీ కేటగిరీకి చెందిన కనిశక్ కటారియా ఐఐటి ముంబయిలో బి.టెక్ ను పూర్తి చేశారు. అక్షత్‌జైన్ రెండవ ర్యాంకు సాధించగా, జునైద్ అహ్మద్ మూడవ ర్యాంకు, శ్రియాన్స్ కుమత్ నాలుగవ ర్యాంకు సాధించారు. సివిల్స్‌లో ఐదవ ర్యాంకు సాధించిన శృతి జయంత్ దేశ్‌ముఖ్ మహిళల్లో మొదటి ర్యాంకు సాధించారు.

సివిల్స్‌కు దేశవ్యాప్తంగా 577 మంది పురుషులు, 182 మంది మహిళలు కలిపి మొత్తం 759 మంది అభ్యర్థులు ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఎ, గ్రూప్-బికి ఎంపిక చేసినట్లు యుపిఎస్‌సి ప్రకటించింది. ఇక మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్‌రెడ్డి సివిల్స్‌లో ఆలిండియా స్థాయిలో ఏడవ ర్యాంకు సాధించారు. గతంలో 170వ ర్యాంకు సాధించిన వరుణ్‌రెడ్డి, ప్రస్తుతం ఐఆర్‌ఎస్ శిక్షణలో ఉంటూనే తన ప్రయత్నం మళ్లీ కొనసాగించారు.

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎంఎల్‌ఎ బానోతు మదన్‌లాల్ కుమారుడు బానోతు మృగేందర్‌లాల్ దేశవ్యాప్తంగా సివిల్స్ సత్తా చాటారు. మృగేందర్‌లాల్ జాతీయ స్థాయిలో 551 ర్యాంకు సాధించారు. అలాగే వరంగల్ జిల్లాకు శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన చిట్టిరెడ్డి శ్రీపాల్ 131వ ర్యాంకు సాధించగా, షాద్‌నగర్‌కు చెందిన శశికాంత్ సివిల్స్‌లో 695 ర్యాంకు సాధించారు.

- Advertisement -