కోపమొస్తే ప్రజల్నే కాదు.. అధికారులు, మంత్రులు తేడా లేకుండా ఎవర్నైనా అంతం చేయగలమని ఉత్తరకొరియా ప్రూవ్ చేసింది. మిలిటరీ డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ ను గౌరవించడం లేదని.. ఆయన ఆదేశాలను సరిగా ఫాలో కాలేదన్న ఆరోపణతో దేశ రక్షణ మంత్రి హ్యోన్ యోంగ్ చోల్ ను దారుణంగా శిక్షించిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్జోంగ్ఉన్.. తాజాగా మరోసారి తన వికృత రూపాన్ని చూపించాడు. తన అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలో ఉప ప్రధాని సక్రమంగా కూర్చోలేదని ఆయనను కూడా ఉరితీసినట్లు దక్షిణకొరియా మీడియా బుధవారం వెల్లడించింది.
గత జూలైలో ఉప ప్రధాని కిమ్యాంగ్జిన్ను బహిరంగంగా ఉరితీయించారని పేర్కొంది. కిమ్జోంగ్ ఉన్ అధ్యక్షతన జరిగిన ఓ ఉన్నతస్థాయి సమావేశంలో ఉప ప్రధాని కిమ్యాంగ్జిన్ అసభ్యకరమైన రీతిలో కుర్చీలో కూర్చున్నారంటూ వెంటనే అతడిని అరెస్ట్ చేసి విచారణకు ఆదేశించారు. విచారణలో ఉపప్రధాని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, దేశంలో విప్లవాన్ని లేవదీస్తున్నాడని ఆరోపణలు మోపీ మరణశిక్ష విధించారని దక్షిణకొరియా మీడియా తెలిపింది.
ఇదే ఆరోపణలపై ఇద్దరు సీనియర్ అధికారులను కూడా పదవి నుంచి తొలగించి వారికి మరణశిక్షను అమలు చేశారని తెలిపింది. ఇంకా కొందరు అధికారులను రివల్యుషనరీ రీ ఎడ్యుకేషన్ ప్రొగ్రాం కింద అడవుల్లోకి పంపినట్టు దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. అయితే ఉత్తర కొరియాలో ఇలాంటి అరాచకం కొత్తేం కాదు. గతంలో కూడా చాలా మంది అధికారులను, బంధువులకు ఇలా బహిరంగ ఉరిశిక్షలు, కాల్చివేతలు జరిగాయి.