రైతును లాభసాటిగా మార్చడమే మన ధ్యేయం..

133
harish
- Advertisement -

నారు పోసే పనిలేదు. నారు పీకే పనిలేదు. నాటు పెట్టే పనిలేదు. కూలీల కోసం గొడవ లేదు. కలుపు కూలీల ఇబ్బంది లేదు. 5 రకాల లాభాలున్నాయి. మామూలు పద్ధతిలో అయితే ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలి. ఈ వెదజల్లే పద్ధతి అయితే 8 కిలోల విత్తనపొడ్లు సరిపోతయి. వడ్లు సల్లినంక ఎన్ని రోజులకైనా నీళ్లు కట్టుకోవచ్చు. విత్తనపొడ్లు వెదజల్లినంక వర్షం పడే దాక కొన్నిరోజులు ఎదురు చూస్తే ఇంకా మంచిది. నారుమడి ప్రిపరేషన్ లో వెయ్యి రూపాయలు ఆదా అవుతుంది. నారు పీకేందుకు, నాట్లు వేసేందుకు 6 వేల ఖర్చు ఆదా. నీరు తక్కువ, కరెంటు ఆదా, రాళ్ల వాన ఇబ్బందులు ఉండవు. నీటి వినియోగం 30-35 శాతం తగ్గుతుంది. 10-15 రోజుల ముందే క్రాప్ వస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు చెప్పారు. సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామంలో వరిలో వెద సాగు పద్ధతి లో సాగుచేస్తున్న పంగ ఎల్లారెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి మంగళవారం సందర్శించి, నియోజకవర్గ పరిధిలోని సర్పంచ్ లు, రైతు బంధు సమితి నాయకులు, ఆయా గ్రామాల నుంచి వచ్చిన రైతులకు వరి వెదజల్లే పధ్ధతిపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిపారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రైతును లాభసాటిగా మార్చడమే మన ధ్యేయంగా ముందుకు సాగాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. లక్ష్మీ అనే రైతు 8 ఏళ్ల నుంచి చేస్తున్నారని, మీటింగ్ పెడితే మరికొంత మంది రైతులు స్ఫూర్తి పొందారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితి నాయకులుగా రైతులకు, ప్రజలకు ఇలాంటి ఉపయోగపడే సేవ చేయడమే నిజమైన సేవని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన పొలంలో వెదజల్లే పద్ధతిలో సాగు చేసి 42 క్వింటాళ్లు దిగుబడి పొందారని తెలిపారు. ఈ వానాకాలంలో సిద్ధిపేట నియోజకవర్గంలో 20 వేల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకుని సత్ఫలితాలను సాధించాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. వెదజల్లే పద్ధతిలో రాష్ట్రంలో నెంబరు వన్ ఉండాలని, వరి సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని సూచించారు.

కేంద్రం ఎఫ్‌సీఐ ద్వారా సన్నరకం బియ్యం కొనుగోళ్లు చేస్తామని, దొడ్డు రకం కొనమని కొర్రీలు పెట్టినట్లు, కేరళ మినహా మిగతా చోట్ల దొడ్డు రకం కొనడం లేదని, సన్న బియ్యంతో రానున్న రోజుల్లో సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నదని మంత్రి సవివరంగా వివరించారు. వానాకాలం ప్రత్యామ్నాయంగా పంట మార్పిడిలు చేయాలని, పత్తి, కంది పంట పండించాలని కోరుతూ.. కంది, పత్తి పంటలు పెడితే మేలు జరుగుతుందని మంత్రి అవగాహన కల్పించారు. అదే విధంగా ఆయిల్ ఫామ్ తోటలు పెంపకాన్ని చేపట్టాలని రైతులను కోరారు. వరి నాటులో వెదజల్లే పద్ధతి ద్వారా వరి పంట సాగు చేస్తే.. రెండు పంటలకు కలిపి ఎల్లారెడ్డి రైతుకు 60 క్వింటాళ్లు పైనే రానున్నదని చెప్పారు.ఈ పద్ధతిలో వరి పంట సాగు చేస్తే ఎకరానికి (1-2 క్వింటాళ్లు) దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మామూలు పద్ధతిలో అయితే ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలి. ఈ వెదజల్లే పద్ధతి అయితే 8 కిలోల విత్తనపొడ్లు సరిపోతయి. వడ్లు సల్లినంక ఎన్ని రోజులకైనా నీళ్లు కట్టుకోవచ్చు. విత్తనపొడ్లు వెదజల్లినంక వర్షం పడే దాక కొన్నిరోజులు ఎదురు చూస్తే ఇంకా మంచిదని మంత్రి చెప్పుకొచ్చారు.

వరిలో మూస పద్ధతికి స్వస్తి చేపుతూ ప్రత్యక్ష సాగుకు ఆసక్తి చూపుతున్న రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుందని మంత్రి తెలిపారు.సాగులో పెట్టుబడులు తగ్గడం, నాట్లకు ముందు చేయాల్సిన పొలం పనులేవీ చేయాల్సిన పనిలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చునని పేర్కొన్నారు. ఆ కోవలోనే వెదజల్లే విధానంలో వరి సాగు చేస్తున్న రైతు ఎల్లారెడ్డి, వెంకట్ రెడ్డి, మహేంద్రారెడ్డిలు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. పంగ ఎల్లారెడ్డి రైతు చెప్పిన వెదజల్లే విధానం.. రైతు మాటల్లో.. పంగ ఎల్లారెడ్డి తనకున్న 8 ఎకరాల్లో వెదజల్లే సాగు చేపట్టాను. ఎకరానికి 30 క్వింటాళ్లు దిగుబడి వచ్చినట్లు తెలిపారు. లేబర్ ఖర్చు ఇబ్బందితో మొదలు పెట్టిన. కొండపలకల గ్రామం పోయి వచ్చిన. ఎకరానికి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. కలుపు కూడా 20 రోజులకు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. దిగుబడి కూడా ఎక్కువగా వచ్చింది.

అలాగే సిద్ధిపేట అర్బన్ మండలం ఎల్లుపల్లి గ్రామ రైతు వెంకట్ రెడ్డి వెదజల్లే పద్ధతిలో సాగు చేసి, ఎకరానికి 40 క్వింటాళ్లు, 5 ఎకరాలలో పంట పండించినట్లు రైతు వెంకట్ రెడ్డి వివరించారు. వెద సాగు అంటేనే నారు పెంచే పని ఉండదు. నారు మడికి ఎరువు పెట్టాల్సిన అవసరమూ రాదు., వరి నారు తీసేందుకు కూలీలకు అవస్థ పడాల్సిన అవసరమూ లేదని రైతు వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా సిద్ధిపేట అర్బన్ మండల రైతు, టీచర్ మహేంద్రారెడ్డి సాధారణ సాగుకు, వెద సాగుకు మధ్యన సాగు ఖర్చులు ఏ విధంగా ఉంటాయి ? రైతులకు ఈ పద్ధతిలో ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి ? మరి ఈ ప్రకృతి విధానంలో వెద సాగు గురించి రైతు తమ అనుభవాలను రైతులు వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీహరి, వ్యవసాయ శాఖ అధికారి పర్శరామ్, ఇతర ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -