అత్యద్భుత క్షేత్రంగా యాదాద్రి

270
Land oustees of Yadagirigutta meet KCR
Land oustees of Yadagirigutta meet KCR
- Advertisement -

యాదాద్రిని అత్యద్భుత పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నందున రాబోయే కాలంలో భక్తుల రద్దీ బాగా పెరుగుతుందని, దీనికి అనుగుణంగా యాదగిరిగుట్టలో ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. యాదాద్రి అభివృద్ధి పనులను క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సమీక్షించారు.
ప్రధాన ఆలయముండే గుట్టుకు అభిముఖంగా ఉన్న గుట్టలతో కూడుకున్న ప్రాంతాన్ని టెంపుల్‌ సిటీగా మార్చేందుకు నిర్ణయించిన నేపథ్యంలోదానికి సంబంధించిన లే అవుట్లు, డిజైన్లను సీఎం పరిశీలించారు. టెంపుల్‌ సిటీని 850 ఎకరాల విశాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇందులో కాటేజీలు, విశాలమైన రోడ్లు, పార్కింగ్‌, ఉద్యానవనాలు, పుట్‌ పాత్‌ లు, పుడ్‌ కోర్టులు, ఇన్పర్మేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

 

మొదటి దశలో 250 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 200 కాటేజీలు, మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో పుడ్‌ కోర్టు, ఏడెకరాల విస్తీర్ణంలో మంచినీరు, మురుగునీరు నిర్వహణ, వ్యవస్థ, పన్నెండున్నర ఎకరాల్లో గ్రీనరీ, 68 ఎకరాల్లో రహదారులు, 26 ఎకరాల్లో ల్యాండ్‌ స్కేపింగ్‌ చేయడంతో పాటు మరో 42 ఎకరాల గుట్ట ప్రాంతాన్ని ప్రకృతి రమణీయంగా తీర్చిదిద్దాలని సీఎం నిర్ణయించారు. యాదాద్రిలో కాటేజీలు నిర్మించడానికి ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి, జెన్‌ కో లతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు ముందుకొస్తున్నాయని వారికి కేటాయించడానికి 1000- 1500 గజాల ఓపెన్‌ ప్లాట్లను వెంటనే సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. కాటేజీలు నిర్మించే ప్రాంతంలో రహదారులు, మురుగునీరు, విద్యుత్, మంచినీరు తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ప్రధాన ఆలయానికి వెళ్లడానికి, రావడానికి రెండు వేర్వేరు రహదారులను నిర్మించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న దారిని పైకి వెళ్లడానికి ఉపయోగించాలని, కిందికి రావడానికి మరో రహదారి నిర్మిస్తున్నామని వెల్లడించారు. భక్తులను గుట్టపైకి తీసుకెళ్లడానికి ఆలయం తరుపునే ప్రత్యేక రవాణా సదుపాయం కూడా కల్పించే యోచన ఉందని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. గుట్టపైన నిర్మాణాలను కూడా సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. యాదాద్రి పూర్తి స్థాయి నిర్మాణాలు పూర్తయిన తర్వాత నిర్వహణ బాధ్యతలు చూసేందుకు అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. యాదాద్రి పనులను జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

 

ఈ సమావేశంలో మంత్రి జగదీష్‌ రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌, వైటిడిఏ స్పెషల్‌ ఆఫీసర్‌ కిషన్‌ రావు, ఆలయ శిల్పులు ఆనందసాయి, ప్రవీణ్‌, ఇంజనీరింగ్‌ అధికారులు వెంకటేశ్వర్‌ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -