ఆపరేషన్ సిందూర్ విజయానికి కొన్ని నెలల తరువాత పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని వ్యాఖ్యానించారు. సోమవారం పార్లమెంట్ సంయుక్త సమావేశంలో మాట్లాడిన ఆయన, భారత నాయకులు మరో యుద్ధానికి సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ప్రాంతీయ శాంతికి జీవితాంతం కట్టుబడి ఉన్న వ్యక్తిగా తాను యుద్ధాన్ని సమర్థించనని అన్నారు.అధ్యక్షుడిగా తొమ్మిదోసారి పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి జర్దారీ ప్రసంగించారు.
భారత నాయకులు మరో యుద్ధానికి సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. నేను ప్రాంతీయ శాంతికి మద్దతుదారుడిగా అలాంటి నిర్ణయాన్ని సూచించను అని జర్దారీ అన్నారు. యుద్ధ వాతావరణం నుంచి దూరంగా వెళ్లి అర్థవంతమైన చర్చల బల్లపైకి రావాలని భారత్కు పిలుపునిచ్చారు. ప్రాంతీయ భద్రతకు చర్చలే ఏకైక మార్గం అని తెలిపారు.
2025లో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్–పాకిస్థాన్ మధ్య నాలుగు రోజులపాటు సరిహద్దు ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ దాడిలో 26 మంది, ముఖ్యంగా పర్యాటకులు, ప్రాణాలు కోల్పోయారు. దానికి ప్రతిగా 2025 మే 7న భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్ మరియు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని ఉగ్రవాద స్థావరాలు, వాయు రక్షణ కేంద్రాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించింది. అయితే నాలుగు రోజుల తరువాత ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
Also Read:దేవరకొండ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్లు

