లంక జలాల్లోకి చైనా స్పై షిప్‌…వాట్‌ నెక్ట్స్!

2519
yuan
- Advertisement -

చైనా స్పై షిప్‌ యువాన్ వాంగ్-5 శ్రీలంకలోని హంబన్ టొట పోర్టుకు చేరుకుంది. స్పై షిఫ్ పోర్టుకు చేరుకున్నట్లు హంబన్‌ టొట హార్బర్ మాస్టర్ కెప్టెన్ నిర్మల్ డిసెల్వ తెలిపారు. షిప్ రాకను కనిపెట్టిన భారత్ వెంటనే స్పందించి శ్రీలంకకు అభ్యంతరాలను తెలియజేసింది. దీనిపై స్పందించిన లంక అధికారులు యువాన్ వాంగ్-5 ప్రయాణాన్ని వాయిదా వేయాలన్నారు. శ్రీలంక సూచన మేరకు షిప్ రాక వాయిదా పడినట్లు ప్రచారం జరిగినా.. గతవారం యువాన్ వాంగ్ హంబన్ టొట దిశగా వెయ్యి కిలోమీటర్ల దూరంలో కదులుతున్నట్లు గుర్తించారు. ప్రయాణ వాయిదాపై లంక ప్రభుత్వాన్ని చైనా అధికారులు ప్రశ్నించడంతో.. వారు సరైన వివరణ ఇవ్వలేకపోయారు. దీంతో శనివారం షిప్ రాకకు అనుమతి మంజూరు చేసింది.

భారత్‌ భయం…
చైనా యువాన్‌ వాంగ్‌ 5 నిఘా నౌక సెన్సార్లు కలిగి ఉండటం వల్ల… భారత్‌ బాలిస్టిక్‌ మిసైల్స్‌ను ప్రయోగిస్తే వాటిని ట్రాక్‌ చేయగలదు. ఈ మిసైల్స్‌ను భారత్‌ ఒడిశాలోని అబ్దుల్‌ కలామ్‌ ఐలాండ్‍ నుంచి ప్రయోగిస్తుంటుంది. వాటిపైన ఓ కన్ను వేయగలదు. యువాన్‌ వాంగ్‌ 5లోని అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాలను ఉపయోగించికొని.. భారత క్షిపణుల పరిధి, ఖచ్చితత్వాన్ని అంచనా వేయగలగుతుంది చైనా. దీంతో మన క్షిపణుల వివరాలు డ్రాగన్‌ చేతికి చిక్కినట్లవుతుంది. ఆ నౌక ఆగస్టు 22 వరకు శ్రీలంకలోనే ఉండనుంది. యువాన్‌ వాంగ్‌ 5 సముద్రంలో సర్వేలు నిర్వహించగలదు. దాంతో హిందూ మహా సముద్రంలో సబ్‌మెరైన్‌ కార్యకలాపాలు సాగించేందుకు వీలు కలగనుంది. ఒక రకంగా హిందూ మహా సముద్రంలో భారత అధిపత్యం కొంతవరకు నష్టపోతుందని భారత్‌ భావిస్తోంది. హిందూ మహా సముద్రంపై పట్టు సాధిస్తే ప్రపంచవ్యాప్తంగా ఓ భయానక వాతావరణంను కృత్రిమంగా చైనా సృష్టిస్తోందన్నఅనుమానంతో భారత్‌ మొదటి నుంచి శ్రీలంకను హెచ్చరిస్తూ వస్తోంది….కానీ పెడచెవిన పెట్టి హాంబన్‌టొటాలోకి యువాన్‌ వాంగ్‌5కు అనుమతినిచ్చారు పోర్టు అధికారులు.

2014లో చైనాకు చెందిన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన నౌకను ఓ పోర్టులోకి శ్రీలంక అనుమతించింది. దాంతో భారత్‌-శ్రీలంక మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. హంబన్‌ టొటా నౌకాశ్రయం కార్యకలాపాలను చైనా సంస్థ నిర్వహిస్తున్నప్పటికీ ఆపరేషనల్‌ సమస్యలను తామే చూసుకుంటున్నట్లు శ్రీలంక పోర్ట్స్‌ అథారిటీ తెలిపింది. చైనాకు రుణాలు చెల్లించలేక హంబన్‌ టొటా నౌకాశ్రయాన్ని 99 ఏళ్ల లీజుకు ఇచ్చిన క్రమంలో భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పోర్టును మిలిటరీ అవసరాల కోసం ఉపయోగించే ప్రమాదం ఉందని ముందు నుంచే హెచ్చరిస్తోంది భారత్‌.

- Advertisement -