త్వరలో 50 వేల పోస్టుల భ‌ర్తీ‌ : మంత్రి హరీష్‌

177
harish rao
- Advertisement -

రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా.. తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వయోపరిమితి పెంపు బిల్లును సభ గురవారం ఆమోదించింది. దాంతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛను పెంపు బిల్లుకూ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లు ప్రకారం కనీస పింఛను రూ.50 వేలు, గరిష్ఠంగా రూ.70 వేలు ఇవ్వనున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చుల సాయాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లుకూ సభ ఆమోదం లభించింది.

సభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. మ‌న దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు 60, 62 ఏండ్లుగా ఉంద‌ని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేర‌కు సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 58 నుంచి 61 ఏండ్ల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు. ఉద్యోగుల అనుభావాన్ని ఉప‌యోగించుకోవాల‌నే ఉద్దేశంతోనే ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు.

ఉద్యోగుల రిటైర్డ్ వ‌య‌సు పెంపుద‌ల వ‌ల్ల ఖాళీల భ‌ర్తీ విష‌యంలో ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌న్నారు. ఉద్యోగుల‌కు ప్రమోష‌న్లు ఇచ్చి ఖాళీల భ‌ర్తీని చేప‌డుతామ‌న్నారు. రాష్ర్టంలో 50 వేల పోస్టుల భ‌ర్తీకి సీఎం కేసీఆర్ ఇప్ప‌టికే ఆదేశించారు. త్వ‌ర‌లోనే ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు వెలువడుతాయ‌ని మంత్రి హ‌రీష్ రావు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్య ప్రమాణాలు మెరుగయ్యాయని, చాలా రాష్ట్రాల్లో పదవీ విరమణ వయసు 62 ఏళ్లు ఉందని హరీష్‌ చెప్పారు. పీఆర్సీ నివేదికతో పాటు ఆయా విషయాలనూ దృష్టిలో ఉంచుకునే ఉద్యోగుల వయోపరిమితిని పెంచామని స్పష్టం చేశారు. త్వరలోనే ఉద్యోగులకు ప్రమోషన్లూ ఇస్తామన్నారు.

- Advertisement -