స్మార్ట్ఫోన్ ప్రపంచంలో వాట్సాప్ అనేది సర్వసాదారణంగా మారింది. ఫొటోలు, వీడియో, ఆడియో క్లిప్పింగ్లను క్షణాల్లో చేరవేయడంతోపాటు సందేశాలు, వాయిస్, వీడియో కాలింగ్ వంటి ఫీచర్లు అందిస్తున్న ఈ యాప్ అనతికాలంలోనే అత్యంత ఆదరణ పొందింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్న వాట్సాప్… తాజాగా మరో నాలుగు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.
వాటిల్లో అతి ముఖ్యమైనది, ఎవరైనా క్రియేట్ చేసిన గ్రూపుల్లో మన అనుమతి లేకుండా మనల్ని చేర్చడం ఇకపై జరగబోదు. ఎవరో క్రియేట్ చేసే గ్రూపులో తమంతట తామే చేరిపోతున్నామని, తమకు ఇష్టం లేకుండానే ఇది జరిగిపోతోందని పలువురు ఫిర్యాదులు చేయడంతో వాట్స్ యాప్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా, ఏదైనా గ్రూప్ లో చేరిస్తే, 72 గంటల్లోగా దాన్ని చూసి, యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేయాల్సి వుంటుంది.

ఇదే సమయంలో కస్టమర్ తన నంబర్ ను గ్రూప్స్ లో యాడ్ చేయవద్దు అనే ఆప్షన్ ను కూడా వాట్స్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. తిరిగి ఆ ఆప్షన్ ను అన్ లాక్ చేసేంత వరకూ మరే గ్రూప్ లోనూ కస్టమర్ యాడ్ కాడు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో వేలిముద్ర సాయంతో అన్ లాక్ చేసుకునే సదుపాయాన్ని, స్పామ్ మెసేజ్ లను సులువుగా గుర్తించేందుకు ‘ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్’ పేరిట సరికొత్త ఫీచర్ ను కూడా వాట్స్ యాప్ ప్రారంభించింది. వరుసగా వచ్చే వాయిస్ మెసేజ్ లను ఒకదాని తరువాత ఒకటి వినేందుకు వీలుగా మరో సరికొత్త ఫీచర్ ను తయారు చేస్తున్నట్టు కూడా వాట్స్ యాప్ పేర్కొంది. ఇలా, రోజుకో అప్డేట్తో తన యూజర్ల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ పోతోంది వాట్సాప్.

