శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

0
- Advertisement -

గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లాలోని ప్రతిష్టాత్మక శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (ఎస్సార్ఎస్పీ) వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 85 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతున్నట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. ఎగువన ఉన్న మహారాష్ట్రతో పాటు క్యాచ్‌మెంట్ ప్రాంతాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, శనివారం నాటికి నీటిమట్టం 1071.70 అడుగులకు చేరుకుంది. అలాగే ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 26 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇన్ ఫ్లో ఇలాగే కొనసాగితే రాబోయే కొన్ని రోజుల్లో ప్రాజెక్టు నీటి నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున నదీ పరివాహక ప్రాంత ప్రజలు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ వర్షాకాలంలో ఎస్సార్ఎస్పీకి జలకళ రావడంతో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ALso Read:వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు ఎందుకు?

- Advertisement -