తుది దశ పోరు..బరిలో ప్రధాని,కేంద్రమంత్రులు

276
modi
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల పోరులోభాగంగా ఏడోదశ ఎన్నికల ప్రచారానికి శుక్రవారంతో తెరపడింది. ఏడు రాష్ట్రాలు,ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 59 స్ధానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు కేంద్రమంత్రులు హర్‌సిమ్రత్ కౌర్‌,హర్దిప్ సింగ్ పూరీ,కాంగ్రెస్ నేతలు పవన్ కుమార్ బన్సాల్,మనీశ్ తివారీ,అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లో 13 సీట్లకు, పశ్చిమ బెంగాల్‌లో 9, బీహార్, మధ్యప్రదేశ్‌ల్లో 8, హిమాచల్‌ప్రదేశ్‌లో 4, జార్ఖండ్‌లో 3, ఛండీగఢ్‌లో ఒక స్ధానంతో పాటు గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ మృతితో ఖాళీ ఏర్పడిన పనాజీ అసెంబ్లీ స్థానానికి కూడా ఆదివారం పోలింగ్ జరుగనుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నుండి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా (ఘాజీపూర్), భోజ్‌పురి నటుడు రవికిషన్ (గోరఖ్‌పూర్) సహా మరో ఏడుగురు బీజేపీ నేతల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు నిర్దేశించనున్నాయి.

బీహార్‌లోని పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున శత్రుఘ్న సిన్హా, బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పోటీ పడుతున్నారు. జార్ఖండ్‌లోని దుమ్కా నుంచి జేఎంఎం అధినేత శిబూసోరెన్, బీజేపీ అభ్యర్థి సునీల్ సోరెన్‌తో తలపడుతున్నారు. 2014లో ఈ 59 సీట్లలో 65 శాతం పోలింగ్ జరిగింది. ఏడోదశలో 59 స్ధానాల్లో 918 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

- Advertisement -