సంపద నిర్మాణంలో ఇంజనీరింగ్ కాంట్రాక్టర్స్ పాత్ర కీలకం..

24
vinod
- Advertisement -

ఇంజనీరింగ్ కాంట్రాక్టర్స్ దేశంలో సంపద నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, దేశ నిర్మాణంలో ప్రధాన భూమిక వహిస్తున్న కాంట్రాక్టర్లకు, ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల అధికారుల మధ్య పారదర్శకత, సామరస్యం ఉండాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఇంజనీరింగ్ కాంట్రాక్ట్స్ – అవాయ్ డెన్స్ ఆఫ్ డిస్ప్యూట్ ఫర్ హార్మోనియస్ గ్రోత్ “* అనే అంశంపై ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరాయ భవన్ లో సోమవారం జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంజనీర్లు, కాంట్రాక్టర్స్ సదస్సు జరిగింది.ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ కాంట్రాక్టర్స్, ఇంజనీరింగ్ విభాగాల మధ్య సఖ్యత, సరైన అవగాహన లేనిపక్షంలో వివాదాలు చెలరేగే ప్రమాదం ఉంటుందన్నారు.

రాష్ట్రంలో ప్రాజెక్టులు, భవనాలు, రోడ్లు, బ్రిడ్జీలు వంటి పలు నిర్మాణాల్లో ఇంజనీరింగ్ కాంట్రాక్టర్స్ ప్రధాన భూమిక పోషిస్తున్నారని, కాంట్రాక్టర్స్, ఇంజనీరింగ్ విభాగాల అధికారుల మధ్య పక్కా ప్రణాళిక, అవగాహన ఉంటే అభివృద్ధి పనులు సాఫీగా ముందుకు సాగుతాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు.దేశంలో వ్యవసాయ రంగం తరువాత నిర్మాణ రంగమే పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తోందని ఆయన గుర్తు చేశారు.

ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య పారదర్శకత, అవగాహన లోపించిన కారణంగా దేశవ్యాప్తంగా సుమారు లక్ష కోట్ల రూపాయల విలువచేసే వివాదాలు వివిధ న్యాయస్థానాలలో కొనసాగుతున్నాయని వినోద్ కుమార్ వివరించారు.ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి, ఇంజనీరింగ్ అధికారులతో అవగాహనకు ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని వినోద్ కుమార్ భరోసా ఇచ్చారు.

ఈ సదస్సులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి, కార్యదర్శి వెంకట సుబ్బయ్య, కాళేశ్వరం (నీటి పారుదల) ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నికల్ ఆర్బిట్రేటర్స్ తెలుగు రాష్ట్రాల ఛైర్మన్ శ్రీధర్ మోతే, కార్యదర్శి ప్రదీప్ రెడ్డి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంజనీర్లు, కాంట్రాక్టర్స్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -