కారును పోలిన గుర్తులతో టీఆర్ఎస్‌కు నష్టం- వినోద్‌

145
vinod
- Advertisement -

త్వరలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థులకు కేటాయించనున్న గుర్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీఆర్ఎస్ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సీ. పార్థసారథి కి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ పార్థసారథితో టీఆర్ఎస్ ప్రతినిధి బృందం భేటీ అయింది.

ఈ భేటీలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ లతో కలిసి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు పలు అంశాలపై ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన కారును పోలిన ఇతర గుర్తుల వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. దీని వల్ల టీఆర్ఎస్ పార్టీ కి తీరని నష్టం జరుగుతోందని ఆయన తెలిపారు. గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆటో, ట్రక్కు, రోడ్ రోలర్ వంటి గుర్తుల వల్ల తమ పార్టీ అభ్యర్థులు ఓటమి చెందారని, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో ఆ గుర్తులను తొలగించారని ఆయన తెలిపారు.

ఇటీవల జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రోటీ మేకర్ గుర్తు కూడా టీఆర్ఎస్ పార్టీకి నష్టాన్ని కలిగించిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.ఇలాంటి చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకు పోలిన గుర్తులను తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ను కోరినట్లు వినోద్ కుమార్ తెలిపారు. గత ఆరేళ్లుగా శాంతి భద్రతల విషయంలో గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే మెరుగైన నగరంగా నిలిచిందని వినోద్ కుమార్ తెలిపారు.

దేశ నలు మూలలకు చెందిన ప్రజలు హైదరాబాద్ నగరంలో ప్రశాంతంగా జీవిస్తున్న విషయాన్ని వినోద్ కుమార్ గుర్తు చేశారు. సోషల్ మీడియా కేంద్రంగా జరుగుతున్న దుష్ప్రచారంపై నిఘా ఉంచాలని, దీనిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ కోరారు. సోషల్ మీడియా ద్వారా కొన్ని శక్తులు సామాజికంగా విద్వేషాలను రెచ్చ గొడుతున్నాయని, తప్పుడు సమాచారంతో గందరగోళం సృష్టిస్తున్నాయని వినోద్ కుమార్ అన్నారు. ఇలాంటి ముఠాలపై కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

- Advertisement -