“విరాట పర్వం”తో సాయి పల్లవికి జాతీయ అవార్డ్ : వెంకటేష్

66
virataparvam
- Advertisement -

“విరాట పర్వం” ప్రీరిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా విక్టరీ వెంకటేష్ హాజరయ్యారు. ఆయన ”సాయి పల్లవి కెరీర్ లో విరాటపర్వం ఒక బెస్ట్ ఫిల్మ్. విరాట పర్వంలో నటనకుగాను సాయి పల్లవికి జాతీయ అవార్డ్ వస్తుంది” అని అన్నారు. పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, నేచురల్ పెర్ఫార్మర్ సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. చిత్ర బృందంతో పాటు దర్శకుడు కిశోర్ తిరుమల, దర్శకుడు శరత్ మండవ అతిధులుగా విచ్చేశారు.

ఈ వేడుకలో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. “అభిమానులకు ప్రేక్షకులకు నమస్కారం. విరాట పర్వం లాంటి గొప్ప సినిమా తెలుగులో రావడం ఆనందంగా వుంది. రానా తన తొలి సినిమా లీడర్ నుండి ఇప్పటి వరకూ తన ప్రతి సినిమాని, పాత్రని ఎంతో అంకిత భావంతో చేస్తున్నారు. రానా విరాట పర్వం చేసినందుకు చాలా ఆనందంగా వుంది. ట్రైలర్ చూసినప్పుడే విరాట పర్వం చాలా మంచి చిత్రమని అనుకున్నాను. రానా తప్పకుండా విజేతగా నిలుస్తారు. దర్శకుడు వేణు ఉడుగులకు కంగ్రాట్స్. మన తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక నిజాయితీ గల ఫిల్మ్ మేకర్ వేణు రూపంలో దొరకడం ఆనందంగా వుంది. విరాట పర్వం రైటింగ్ , విజువల్స్, నిర్మాణ విలువలు, నటీనటుల ఫెర్ఫార్మెన్స్ అత్యున్నత స్థాయిలో వుంటాయి. సినిమా చూసిన తర్వాత మీరే ఈ విషయాన్ని చెబుతారు. సాయి పల్లవి, ప్రియమణి , జరీనా, నవీన్ చంద్ర ,, అందరూ అవార్డ్ విన్నింగ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సాయి పల్లవి నవ్వు చాలు. అంత అద్భుతంగా వెన్నెల పాత్రని పోషించారు సాయి పల్లవి. డానీ, దివాకర్ మణి , సురేష్ బొబ్బిలి, పీటర్ హెయిన్స్ ఇలా సాంకేతిక నిపుణులంతా అత్యుత్తమ స్థాయిలో పని చేశారు. నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ లు ఇలాంటి చాలెంజింగ్ సబ్జెక్ట్ ని తీసుకొని అద్భుతమైన సినిమా చేసినందుకు కంగ్రాట్స్. సినిమా చూడండి. సూపర్ ,ఎక్స్టార్డినరీ, అదిరిపోయింది” అన్నారు.

సాయి పల్లవి మాట్లాడుతూ.. “వెంకటేష్ ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. విరాట పర్వం నా కెరీర్ లో చాలా ముఖ్యమైన సినిమా అవుతుంది. యదార్ధ సంఘటనలు ఆధారంగా నేను ఇప్పటివరకూ సినిమాలు చేయలేదు. విరాట పర్వం చాలా కొత్త, గొప్ప అనుభూతిని ఇచ్చింది. మీకు కూడా అలాంటి అనుభూతే కలుగుతుందని నమ్ముతున్నాను. వెన్నెల లాంటి గొప్ప పాత్ర ఇచ్చిన వేణు కి కృతజ్ఞతలు. ఈ చిత్రం తర్వాత కూడా వేణు మంచి కథలు ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తారని నమ్ముతున్నాను. డానీ, దివాకర్ మణి , సురేష్ బొబ్బిలి, నాగేంద్ర గారు ఇలా సాంకేతిక నిపుణులు అంతా గొప్పగా పని చేశారు. వారు చేసిన వర్క్ ని మీరు థియేటర్ లోనే ఎంజాయ్ చేయాలి. ఈశ్వరి, నవీన్ చంద్ర, సాయి చంద్, ప్రియమణి. జరీనా వాహేబ్, రాహుల్ .. వీరి పాత్రలన్నీ చాలా గొప్పగా వుంటాయి. నిర్మాతలు సుధాకర్ గారు, శ్రీకాంత్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. విరాట పర్వాన్ని ఒక బిడ్డలా చూసుకున్నారు. వారికీ ఎంత థాంక్స్ చెప్పుకున్నా తక్కువే. రానా గొప్ప మనసున్న మనిషి. ఆయన ఎత్తుకు తగ్గట్టే పెద్ద మనసున్న మనిషి. గొప్ప కథలు, మంచి కథలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో రానా మన ఇండస్ట్రీకి టార్చ్ బ్యారర్ లాంటి వారు. ఆయనతో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నా. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరించండి. విరాట పర్వం మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. మీ ప్రేమకు కోటి ధన్యవాదాలు” అని తెలిపారు.

హీరో రానా మాట్లాడుతూ.. “దర్శకుడు వేణు ఉడుగుల ఎంతో నిజాయితీతో తను పెరిగిన ఊరులో వున్న పరిస్థితుల్లో ఒక భయానక నేపధ్యంలో ఒక అద్భుతమైన ప్రేమకథని చేశారు. సాయి పల్లవి నడుస్తుంటే పక్కన వెన్నెల తిరుగుతున్నట్లు వుంటుంది. సాయి పల్లవి లేకపోతే ఈ సినిమా వుండేది కాదు. సాయి పల్లవితో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నా. ఇలాంటి అద్భుతమైన కథలు చేసే నిర్మాతలు అరుదుగా వుంటారు. ఇలాంటి గొప్ప సినిమాని తీసిన నిర్మాతలు సుధాకర్, శ్రీకాంత్ కి కృతజ్ఞతలు. డానీ, దివాకర్ మణి , సురేష్ బొబ్బిలి ఇలా సాంకేతిక నిపుణులు గొప్పగా పని చేశారు. రవన్న దళం నవీన్ చంద్ర, ప్రియమణి అద్భుతమైన పాత్రలు పోషించారు. ఈశ్వరి రావు, నందితదాస్, జరీనా వహాబ్ ఇలా అందరూ గొప్పగా చేశారు. నాకు కథలు నచ్చి సినిమాలు చేసుకుంటూ వెళ్లాను. ఇది నటుడిగా నేను చేస్తున్న చివరి ప్రయోగం అనుకోవచ్చు. ఇకపై నా అభిమానుల గురించి సినిమాలు చేస్తా. విరాటపర్వం మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

తదుపరి దర్శకుడు వేణు ఉడుగుల మాట్లాడుతూ.. “ఈ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చిన వెంకటేష్ గారికి ధన్యవాదాలు తెలిపారు. నా రైటింగ్ , డైరెక్షన్ టీం కి కృతజ్ఞతలు. సింహాలు వాటి చరిత్ర అవి రాసుకోనంత వరకూ వేటగాడు చెప్పేదే చరిత్ర అవుతుంది. మన జీవితాన్ని మనం ఆవిష్కారించనంత వరకూ పక్కవాడు చెప్పేదే మన జీవితం అవుతుంది. తెలుగు సినిమా చరిత్రలో గూడవల్లి రామబ్రహ్మం,ప్రకాష్ కోవెలమూడి,టీ కృష్ణ, నేడు సుకుమార్.. వీరందరి స్ఫూర్తితోనే నా మూలాల్లోకి వెళ్లి తీసిన సినిమా విరాట పర్వం. ఇందులో హింసని గ్లామర్ గా చూపించలేదు. మావో సిద్దాంతాన్ని ప్రోపగాండ గా చెప్పలేదు. ప్రేమ దైవమని చెప్పాం. మానవ స్వేఛ్చలో ప్రేమ ఒక భాగమని చెప్పాం. ప్రేమకి మించిన ప్రజాస్వామిక విలువ ఈ భూమ్మిద ఏదీ లేదని చెప్పాం. 1990లో ఒక రాజకీయ సంక్షోభాన్ని కాన్వాస్ గా చేసుకొని నాటి మానవీయ పరిస్థితి చర్చించే ప్రేమకథ విరాట పర్వం. పాటకి పల్లవి ఎంత ముఖ్యమో విరాట పర్వానికి సాయి పల్లవి అంత ముఖ్యం. సాహిత్యం లేకుండా పాట ఉటుందా ? పాటకి సాహిత్యం ఎంత ముఖ్యమో ఈ చిత్రానికి రానా అంత ముఖ్యం. రానా చంద్రుడైతే సాయి పల్లవి వెన్నెల. ఈ చిత్రంలో ఎనిమిది కీలక పాత్రల్లో ఐదు పాత్రలు స్త్రీలు పోషించారు. ఒక్కొక్క పాత్ర ఒక్కో దశలో కథని మలుపు తిప్పుకుంటూ వెళుతుంది. డానీ, దివాకర్ మణి , సురేష్ బొబ్బిలి ఇలా సాంకేతిక నిపుణులు ఎంతో గొప్ప స్పిరిట్ తో పని చేశారు. ఇంత గొప్ప నటీనటులు, టెక్నికల్ టీం ఇచ్చిన నా నిర్మాతలకు కృతజ్ఞతలు. వారు ఈ అవకాశం ఇవ్వడం వలనే ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా తీయగలిగాను. మీకు ఈ చిత్రం గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. గొప్ప జ్ఞాపకంగా నిలుస్తుందని హామీ ఇస్తున్నాను” అని అన్నారు.

నిర్మాత సుధాకర్ చెరుకూరి,శ్రీకాంత్ మాట్లాడుతూ.. “మేము పిలవగానే మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన వెంకటేష్ కి కృతజ్ఞతలు. విరాట పర్వం మూడేళ్ళు కష్టపడి చేశాం, ఈ సినిమా వెనుక చాలామంది కష్టం వుంది. మీరు సినిమా చూస్తే మా కష్టం ఏమిటో తెలుస్తుంది. అలాగే ఈ సినిమా టికెట్ ధరలు కూడా అందరికీ అందుబాటులో వుండేవిధంగా ఉంచాం. తెలంగాణ సింగల్ స్క్రీన్ లో 150, మల్టీఫ్లెక్స్ లో 200, ఏపీలో సింగిల్ స్క్రీన్ లో 147, మల్టీఫ్లెక్స్ లో 177సాధారణ రేట్లు గా వుంటాయి. మీరంతా థియేటర్ లో సినిమా చూడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నవీన్ చంద్ర మాట్లాడుతూ.. “ఇంత గొప్ప సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాతలు సురేష్ బాబు, సుధాకర్ , శ్రీకాంత్ కి, దర్శకుడు వేణు కి కృతజ్ఞతలు. రానా ఈ సినిమా అంతా మా వెనుక బలంగా నిల్చున్నారు. ఇందులో రఘన్న అనే పాత్ర చేశాను. మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. ఇది వెన్నెల కథ” అన్నారు.

రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. “విరాట పర్వం చూస్తే తెలంగాణ గ్రామల్లో వున్న మట్టి వాసన యాదికొస్తది. ఆ మట్టి వాసన తీసుకొచ్చిన దర్శకుడు వేణన్నకి దానికి సహకరించి నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ కంగ్రాట్స్” తెలిపారు.

దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. “సినీ పరిశ్రమ హైదరాబాద్ లో ఏర్పాటైన దగ్గర నుండి అనేక మంది హాయిగా పని చెసుకుంటున్నామంటే కారణం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్. వారికి ఎప్పటికీ రుణపడి వుంటాం. విరాట పర్వం నిర్మాతలు సుధాకర్ , శ్రీకాంత్ కి సినిమా పట్ల గొప్ప ప్యాషన్ వుంది. ఎక్కడా రాజీ పడరు. దర్శకుడు వేణు రైటింగ్ చాలా పవర్ ఫుల్. సాయి పల్లవి లాంటి నటి దొరకడం ఇండస్ట్రీ అదృష్టం. వెన్నెల పాత్ర గొప్పదని చెబుతున్నారు. వెన్నెల అంతలా ప్రేమించేలా చేసిన రవన్న పాత్ర ఎంత గొప్పగా వుంటుందో నాకు తెలుసు. రానా పాత్ర ఎంపికలో చాలా ఖచ్చితంగా వుంటారు. విరాట పర్వం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని పేర్కొన్నారు.

సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ..”మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన వెంకటేష్ కి ,రానా కి ప్రత్యేక కృతజ్ఞతలు. సాయి పల్లవిని నేను అక్కగా భావిస్తా. డానీ, దివాకర్ మణి వర్క్ ప్రపంచం చూడబోతుంది. నిర్మాతలు సుధాకర్ , శ్రీకాంత్ కి కృతజ్ఞతలు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణు అన్నకి ఎప్పటికీ రుణపడి ఉంటా. సినిమా చూడండి. రవన్న వొస్తాండు.. రాంప్” అన్నారు.

జరీనా వహేబ్,నటి ఈశ్వరి మాట్లాడుతూ.. దర్శకుడు వేణుకి, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈశ్వరి “చాలా ఇష్టంతో చేసిన చిత్రం విరాట పర్వం. నా చిత్రాలలో విరాట పర్వానికి అగ్రస్థానం వుంటుంది. సురేష్ ప్రొడక్షన్ లో గొప్పగొప్ప సినిమాలు చూసి పెరిగినవాళ్ళం. ఇప్పుడు చాలా రోజుల తర్వాత సురేష్ బాబు, రానా, సుధాకర్, శ్రీకాంత్ వల్ల మరో గొప్ప సినిమాగా విరాటపర్వం వస్తుంది. రానా సాయి పల్లవి లాంటి నటులు వుంటే ఇలాంటి సినిమాలు ఇంకెన్నో వస్తాయి” అని అన్నారు.

సినిమాటోగ్రాఫర్ డానీ మాట్లాడుతూ…”విరాట పర్వం చిత్రం చేసినందుకు చాలా ఆనందపడుతున్నా. మహానటి తర్వాత అంతే వైవిధ్యమైన సినిమా విరాటపర్వం. ఇందులో కూడా మెయిన్ హీరో ఒక మహిళ. రవన్నగా రానా ది కూడా చాలా ప్రాధన్యత గల పాత్ర. విజువల్స్ అన్నీ చాలా వైవిధ్యంగా వుంటాయి. సరికొత్త టెక్నాలజీ ఈ చిత్రం కోసం వాడాం అది మీరంత తెరపై చూస్తారు. విరాట పర్వం ప్రేమ కథ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. నాపై నమ్మకం వుంచినందుకు సురేష్ బాబు, సుధాకర్ , శ్రీకాంత్, దర్శకుడు వేణు కి కృతజ్ఞతలు” తెలిపారు.

సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి మాట్లాడుతూ.. “విరాట పర్వం చిత్రానికి పని చేయడం గొప్ప అనుభూతి. దర్శకుడు వేణు అద్భుతమైన కథని రాశారు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని తెరకెక్కించారు. సాయి పల్లవి , రానా మిగతా టీమ్ అద్భుతంగా నటించారు. విరాటపర్వం మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ.. “దర్శకుడు వేణు ఉడుగుల ఒక యధార్ధ కథని హార్ట్ టచ్చింగ్ తీశారు. ఇలాంటి అద్భుతమైన సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు, నిర్మాతలకు కృతజ్ఞతలు. నిర్మాతలు సుధాకర్, శ్రీకాంత్ ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రమోషన్స్ కోసం స్పెషల్ గా సెట్ వేయడం నిర్మాతలుగా సినిమాపట్ల వారికున్న ప్యాషన్ కి నిదర్శనం, ఇంత గొప్ప నిర్మాతలతో పని చేసినందుకు ఆనందంగా వుంది. విరాట పర్వం గొప్ప సినిమా. అందరూ తప్పకుండా చూడాలి” అన్నారు.

ఇక జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న విరాట పర్వం అభిమానులను, ప్రేక్షకమహాశయులను ఏమేరకు ఆకట్టుకోనుందో వేచిచూడాలి.

- Advertisement -