పారిశ్రామిక కారిడార్ పనులు వేగవంతం చేయండి..

470
venkaiah naidu
- Advertisement -

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రతిపాదించిన పరిశ్రమలు, ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం పనిని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య, భారీ పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్‌కు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. శుక్రవారం ఉపరాష్ట్రపతి నివాసంలో కేంద్ర మంత్రితోపాటు వాణిజ్య శాఖ కార్యదర్శి, భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శులతో జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపాదిత ప్రాజెక్టుల పనితీరును ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు.

విశాఖపట్టణం-చిత్తూరు మధ్య పారిశ్రామిక కారిడార్ పనుల గురించి, కాకినాడలో ఏర్పాటుచేయ సంకల్పించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)పైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. గుంటూరులోని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో సమన్వయం చేసుకుంటూ గుంటూరు జిల్లాలో స్పైస్ పార్క్ ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సూచించారు.

దీంతోపాటుగా.. తెలంగాణలోని హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌పైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలో ప్రతిపాదించిన ఫార్మాసిటీ అంశంపైనా ఉపరాష్ట్రపతి వివరాలు తెలుసుకున్నారు.

ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకు వాటికి నిర్దేశించి సమయంలోగా పూర్తిచేయాలని ఉపరాష్ట్రపతి ఆదేశించారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి ప్రాజెక్టుల వ్యవహారంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రికి సూచించారు. దీనికి మంత్రి, రెండు శాఖల కార్యదర్శులు సమాధానమిస్తూ.. వీలైనంత త్వరగా పూర్తిచేసేలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి ముందడుగేస్తామన్నారు.

- Advertisement -