సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఫలితాల అనంతరం ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ వ్యవహారంలో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు రాహుల్ ప్రకటించడంతో కాంగ్రెస్ వర్గాలు తలపట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ వంటి జాతీయపార్టీని నడిపించాలంటూ గాంధీల వారసులే సరైనవాళ్లు అని సొంతపార్టీ నేతలే అభిప్రాయపడుతుంటే, రాహుల్ మాత్రం ససేమిరా అంటున్నారు. దాంతో, రాహుల్ గాంధీనే తప్పుకున్నప్పుడు తమకెందుకు పదవులు అంటూ దేశవ్యాప్తంగా పీసీసీ నేతలు, కార్యదర్శులు కూడా రాజీనామాలు చేస్తున్నారు.
ఇటీవల మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనమా చేశారు. ఇక తాజాగా ఎఐసిసి కార్యదర్శి పదవికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కోరుతూ కాంగ్రెసు నేతలు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా విహెచ్ తన పార్టీ పదవికి శనివారంనాడు రాజీనామా చేశారు.
తన రాజీనామా లేఖను విహెచ్ సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి పంపించారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ ఒక్కరే బాధ్యత వహించకూడదని ఆయన అన్నారు. సీనియర్ నేతలతో పాటు కార్యకర్తలకూ బాధ్యత ఉంటుందని అయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడమే తెలంగాణలో పార్టీ ఓటమికి కారణమని విహెచ్ అన్నారు.