2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్ తన 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, దేశపు సాంస్కృతిక వైభవం, సైనిక శక్తి, అభివృద్ధి ప్రగతిని ప్రతిబింబించే విధంగా వేడుకలు నిర్వహించబడుతున్నాయి. ఈ ఏడాది వేడుకల్లో ‘వందే మాతరం’ 150 ఏళ్ల వారసత్వం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
సోమవారం అమెరికా భారత్కు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటన విడుదల చేస్తూ, న్యూఢిల్లీ–వాషింగ్టన్ మధ్య ఉన్న బలమైన, ఫలప్రదమైన సహకారాన్ని హైలైట్ చేశారు. రక్షణ రంగం, ఇంధనం, కీలక ఖనిజాలు (క్రిటికల్ మినరల్స్), కొత్త సాంకేతికతలు వంటి కీలక రంగాల్లో భారత్–అమెరికా మధ్య ఉన్న భాగస్వామ్యం రెండు దేశాలకు “నిజమైన ఫలితాలు” ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ (ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా) ద్వారా కొనసాగుతున్న బహుళస్థాయి సహకారాన్ని కూడా ప్రశంసించారు.
అమెరికా ప్రజల తరఫున, భారత ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమెరికా, భారత్ మధ్య ఒక చారిత్రక బంధం ఉంది. రక్షణ, ఇంధనం, కీలక ఖనిజాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, అలాగే క్వాడ్ ద్వారా జరుగుతున్న సహకారం ద్వారా ఈ భాగస్వామ్యం రెండు దేశాలకు మాత్రమే కాకుండా ఇండో–పసిఫిక్ ప్రాంతానికి కూడా నిజమైన ఫలితాలు ఇస్తోంది. రాబోయే సంవత్సరంలో కూడా పరస్పర లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్తో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు.
Also Read:Modi:వికసిత్ భారత్ దిశగా అడుగులు
ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకునే గణతంత్ర దినోత్సవం, 1950లో భారత్ రాజ్యాంగాన్ని ఆమోదించి, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రంగా అవతరించిన రోజుకు ప్రతీక. ఇది స్వాతంత్ర్య పోరాటానికి ముగింపు, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలపై ఆధారపడ్డ రాజ్యాంగ పాలనకు ఆరంభ సూచికగా నిలుస్తుంది.

