ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్ 22న సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం చెప్పారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ విజయరామరాజు, జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశిల్ జిల్లా యంత్రాంగంతో సోమవారం ఒంటిమిట్టలో జేఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, టీటీడీలోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమష్టి కృషి చేసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని జేఈవో అధికారులను కోరారు. గతంలో జరిగిన లోటుపాట్లను సవరించుకుని శ్రీ సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
ఏప్రిల్ 16వ తేదీ అంకురార్పణ, ఏప్రిల్ 17న శ్రీరామనవమితో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఏప్రిల్ 20వ తేదీ హనుమంత వాహనం, ఏప్రిల్ 21వ తేదీ గరుడవాహనం, ఏప్రిల్ 22వ తేదీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 23న రథోత్సవము, ఏప్రిల్ 25న చక్రస్నానం, ఏప్రిల్ 26న పుష్పయాగము జరుగుతాయని చెప్పారు.
Also Read:శర్వానంద్..’మనమే’ ఫస్ట్ సింగిల్