అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 12వ తేదీ శనివారం జరుగనున్న పుష్పయాగానికి శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
అంకురార్పణ సందర్భంగా స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి కొలువు, అర్చన, నివేదన నిర్వహించారు. అనంతరం మూలవర్లకు అభిషేకం చేపట్టారు. అటు తర్వాత ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు ఆచార్య ఋత్విక్వరణము జరిగింది. సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు మేధిని పూజ, సేనాధిపతి ఉత్సవం, తదుపరి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
జూలై 12వ తేది శనివారం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి పలు రకాల పుష్పాలతో అభిషేకం చేస్తారు.
ఆలయంలో జూన్ 07 నుండి 15వ తేదీ వరకు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు.
Also Read:హైలీ ఎంటర్టైనింగ్..’జూనియర్’

