వైభ‌వంగా పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

47
- Advertisement -

పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్రస్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తుల సమూహంలో అమ్మవారి పంచమీతీర్థ మహోత్సవం వైభవోపేతంగా జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా 50 వేలకు పైగా భక్తులు అమ్మవారి పద్మసరోవరంలో చక్రస్నానం సమయంలో పుణ్యస్నానాలను ఆచరించారని చెప్పారు. ఇంకా వేలాదిమంది భక్తులు వస్తున్నారని, సాయంత్రం వరకు ఈ పుణ్యస్నాన వేడుక జరుగుతూనే ఉంటుందని వివరించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయన్నారు. అన్ని విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారు. భక్తులందరికీ అమ్మవారి కరుణాకటాక్షాలు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

అంతకుముందు ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీతీర్థ మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 5.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. అర్చకులు పంచమి తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

Also Read:రాత్రి పాతబస్తీలో ప్రత్యక్షమైన మంత్రి కేటీఆర్‌

- Advertisement -