తిరుగులేని టీమిండియా!

40
- Advertisement -

గత కొన్నాళ్లుగా టీమిండియా ప్రదర్శన ఎవరి ఊహలకు అందని రీతిలో కొనసాగుతోంది. ఫార్మాట్ ఏదైనా వంద శాతం న్యాయం చేస్తూ జట్టుకు చిరస్మరణీయ విజయాలను అందిస్తున్నారు ప్లేయర్స్. సీనియర్స్ జూనియర్స్ అందరూ సమిష్టిగా రాణిస్తూ టీమిండియాను అన్ని విభాగాల్లోనూ టాప్ లో ఉంచుతున్నారు. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్ లో టెస్టు, వన్డే, టీ20 ఇలా అన్నీ ఫార్మాట్ లలో నెంబర్ ఒన్ గా కొనసాగుతోంది టీమిండియా. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో భారత్ 4-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకున్నా సంగతి తెలిసిందే. ఆ సిరీస్ విజయంతో 122 పాయింట్లతో టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. .

ఇక వన్డే, మరియు టీ20 లలో గత కొన్నాళ్లుగా టీమిండియా టాప్ ప్లేస్ లోనే ఉంది. ఇండియన్ ప్లేయర్స్ కూడా ఆయా విభాగాల్లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. వన్డే ర్యాంకింగ్స్ లో గిల్, విరాట్ కోహ్లీ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక టీ20 లలో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ వన్ స్థానంలో అలాగే కొనసాగుతున్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్ లో కూడా భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. నెంబర్ వన్ టెస్ట్ బౌలర్ గా అశ్విన్ అగ్రస్థానంలో ఉండగా, మూడో స్థానంలో బుమ్రా కొనసాగుతున్నాడు.

ఇక వన్డే ర్యాంకింగ్స్ లో సిరాజ్, బుమ్రా నాలుగు ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20 లలో అక్షర్ పటేల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇలా ఫార్మాట్ ఏదైనా టీమిండియా ఆటగాళ్లు అన్నీ విభాగాల్లో టాప్ 5 లో కొనసాగుతుండడం హర్షించాల్సిన విషయం. గతంలో ఒక్క బ్యాటింగ్ మినహా బౌలింగ్, ఫీల్డింగ్ లో ఘోరంగా విఫలం అయ్యే భారత్.. ఇప్పుడు అన్నీ విభాగాల్లో పటిష్టంగా ఉంటూ ప్రత్యర్థి జట్లకు దడ పుట్టిస్తోంది. ఇక ఈ ఏడాది జూన్ లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అన్ని విభాగాల్లో పత్రిష్టంగా ఉన్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. మరి 2013 ఛాంపియన్ ట్రోఫీ తర్వాత ఐసీసీ కప్ లకు దూరమైన టీమిండియా ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ తో ఆ లోటును భర్తీ చేస్తుందేమో చూడాలి.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే..

- Advertisement -