బీజేపీలో గ్రూపుల లొల్లి.. నేత‌ల్లో క‌ల‌వ‌రం..

35
tbjp
- Advertisement -

టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయం మేమే అని ఇన్నాళ్లు గొప్ప‌లు చెప్పుకున్న బీజేపీ నేత‌ల్లో ఇప్పుడు క‌ల‌వ‌రం మొద‌లైంది. ఇన్నాళ్లుగా సైలెంట్ గా ఉండి, గ్రూపుల‌తో ఇబ్బందిప‌డ్డ కాంగ్రెస్ ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పోటీకి దూసుక‌రావ‌టంతో తాము మ‌ళ్లీ మూడో స్థానానికే ప‌రిమిత‌మా అన్న టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది. దుబ్బాక ఉప ఎన్నిక‌, హుజురాబాద్ ఉప ఎన్నిక‌తో పాటు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీలో కొత్త జోష్ క‌న‌ప‌డింది. కాంగ్రెస్ ఏ మాత్రం ప్ర‌భావం చూప‌క‌పోవ‌టంతో టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయం మేమే అని బీజేపీ నేత‌లు చెప్పుకున్నారు. త‌ట‌స్థంగా ఉన్న ఒక‌రిద్ద‌రు నేత‌ల‌ను పార్టీలోకి తీసుకోవ‌టం… పాద‌యాత్ర పేరుతో ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ హడావిడి చేశారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింది. బీజేపీలోనూ గ్రూపుల లొల్లి స్టార్ట్ అయ్యింది. పైగా అనుకున్నంత‌గా పాద‌యాత్ర ద్వారా మైలేజ్ రావ‌టం లేదు.

మ‌రోవైపు ఇత‌ర ఇష్యూస్ ను ప‌ట్టించుకొని, క‌నీసం మీడియాలో అయినా కొట్లాడే నేత‌లు కూడా లేకుండా పోయారు. దీంతో పొలిటిక‌ల్ సీన్స్ లో వ్య‌వ‌హారం అంతా టీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయింది. పైగా రాష్ట్రానికి రాహుల్ గాంధీ వ‌చ్చాక కాంగ్రెస్ నేత‌ల్లో కొంత మార్పు క‌న‌ప‌డుతుంది. సీనియ‌ర్లు-జూనియ‌ర్ల‌ను ఏకం చేసేందుకు అధిష్టానం తీసుకున్న నిర్ణ‌యాలు రిజ‌ల్ట్ చూపిస్తున్నాయి. దీంతో సెకండ్ ప్లేస్ రేసులో తాము ఎక్క‌డ వెన‌క‌ప‌డిపోతామో అన్న భ‌యంతో బీజేపీ నేత‌లు పార్టీ కీల‌క నాయ‌కుడు అమిత్ షా శ‌ర‌ణు కోరారు. అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా వ‌చ్చినా మైలేజ్ రాలేద‌ని, మీరు రాక‌పోతే మ‌నం మ‌ళ్లీ థ‌ర్డ్ ప్లేస్ కే అంటూ వాపోయిన‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది. మీరు వ‌చ్చి మ‌ళ్లీ కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపాల‌ని, పాద‌యాత్ర ముగింపు స‌భ‌కు మీరు అతిథిగా రావాల‌ని కోర‌గా… అమిత్ షా కూడా ఒప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. పాద‌యాత్ర ఇంత ముందుగా మొద‌లుపెట్టి త‌ప్ప‌ట‌డుగు వేసామా అన్న సందిగ్ధంలో ఉన్న బీజేపీ… ఎన్నిక‌ల ముందు పాద‌యాత్ర‌ల‌ను స్టార్ట్ చేసే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది.

- Advertisement -