ఎన్నికల నిర్వహణపై తెలుగు సీఎస్‌ల సమావేశం

11
- Advertisement -

త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలను పారదర్శకంగా, ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు మరింత సమన్వయంతో పనిచేయాలని తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు నిర్ణయించాయి. ఉభయ రాష్ట్రాల అంతర రాష్ట్ర ఎన్నికల సంబంధిత అంశాలపై నేడు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణా రాష్ట్ర సచివాలయంలో సమన్వయ సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రవీ గుప్త, అడిషనల్ డీజీ లు శివధర్ రెడ్డి, మహేష్ భగవత్, ఏపీ అడిషనల్ డీజీ డా. శంకబ్రత బాగ్చి, ఏపీ వాణిజ్య పన్నులు, ఎక్సయిజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. రజత్ భార్గవ, తెలంగాణా పీసీసీఎఫ్ ఆర్.ఎం. దొబ్రియెల్, ఏపీ పీసీసీఎఫ్ చిరంజీవి చౌదరి లు హాజరయ్యారు.

ఈసందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, మే 13 న జరిగే పోలింగ్ ను సక్రమంగా నిర్వహించేందుకు ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాల పరిధిలోని జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అక్రమ మద్యం, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వివిధ వస్తువుల రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేశామని, శాంతి భద్రతల పరిస్థితి కూడా పూర్తిగా అదుపులో ఉందని, ఇదే రకమైన వాతావరణాన్ని పోలింగ్ వరకు మరింత పకడ్బందీగా కొనసాగించేందుకు ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయి సమావేశం దోహదపడుతుందని పేర్కొన్నారు. గోవా, కర్ణాటక తదితర రాష్ట్రాలనుండి అక్రమ మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులు రాకుండా ఆయా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చెక్-పోస్టులలో మరింత అప్రమత్తత అవసరమని అన్నారు. ఇప్పటికే, తెలంగాణా ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా 36 అంతరాష్ట్ర చెక్-పోస్టులు, ఆటవీ శాఖకు సంబంధించి మూడు అంతరాష్ట్ర చెక్-పోస్టులు, ఎక్సయిజ్ శాఖ ద్వారా ఎనిమిది, 224 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు, వాణిజ్యపన్నుల ద్వారా 7 చెక్-పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటలపాటు పటిష్టమైన గస్తీని ఏర్పాటుచేశామని వివరించారు. తెలంగాణ లో తీవ్రవాద ప్రాబల్యం లేదని, చత్తీస్గఢ్ నుండి మావోయిస్టుల కార్యకలాపాలు జరుగకుండా ఇరురాష్ట్రాల పోలీసులు, కేంద్ర పోలీస్ బలగాల మధ్య పటిష్టమైన సమన్వయంతో పనిచేస్తున్నామని తెలియ చేశారు.

ఆంధ్ర ప్రదేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ, లోక్ సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నందున, ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తెలంగాణాతో పూర్తిస్థాయి సమన్వయంతో కృషి చేస్తున్నామన్నాయి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో గంజాయి మాదక ద్రవ్యాలు, గుడంబా నిరోధానికి గాను ఆపరేషన్ పరివర్తన పేరుతొ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫాలితాలనిచ్చిందని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ కు ఉన్న వివిధ రాష్ట్ర సరిహద్దుల్లో పలు శాఖల ద్వారా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అక్రమ మద్యం రవాణా, డబ్బు పంపిణి, వివిధ వస్తువుల రవాణాను కట్టుదిట్టటంగా అడ్డుకుంటున్నామని తెలిపారు. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మంచి సమన్వయంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.

Also Read:అక్కడ ఉప ఎన్నిక.. గెట్ రెడీ?

- Advertisement -