దేశానికే స్పూర్తిగా తెలంగాణ: మంత్రి కొప్పుల

299
- Advertisement -

శనివారం రాష్ట్ర ఐటి, పురపాలక మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ పుట్టినరోజు సందర్భంగా రామగుండంలోని అబ్దుల్ కలాం స్టేడియం ఆవరణలో సింగరేణీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గోదావరిఖనిలోని రామాలయం మందిరంలో మంత్రి కేటిఆర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి కొప్పుల, ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 8 ఇంక్లైన్ కాలనీలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం అబ్దుల్ కలాం స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రస్తుతం ఎవరు చేయనంత పెద్దగా గత 7 సంవత్సరాలలో మొత్తం 230 కోట్ల మొక్కలను తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద నాటడం జరిగిందని తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంలో అందరిని భాగస్వామ్యం చేసే దిశగా 4 సంవత్సరాల క్రితం రాజ్యసభ సభ్యులు ఎంపి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుత విజయాన్నీ సాధించిందని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక పారిశ్రామికవేత్తలు, సీని నటులు, ప్రముఖులు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగస్వామయి ఇతరులకు స్పూర్తి నింపారని, దేశ ప్రధాని స్థాయిలో సైతం గ్రీన్ ఇండియా చాలెంజ్ మంచి ప్రాముఖ్యత సాధించిందని మంత్రి తెలిపారు. ప్రియతమ నాయకుడు కేటిఆర్ పుట్టినరోజు సందర్బంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మన ప్రాంతంలో 10 లక్షల మొక్కలు నాటమని మంత్రి తెలిపారు. ప్రతి సంవత్సరం రామగుండం ప్రాంతంలో అధికంగా ఉష్ణొగ్రత్తలు నమోదవుతున్నాయని, ఈ ప్రాంతంలో సింగరేణి సంస్థ ఒపెన్ కాస్ట్ మైనింగ్ గుట్ట ప్రాంతంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని మంత్రి సూచించారు.

ఎంపి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. గత సంవత్సరం మంత్రి కేటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా కోటి 75 లక్షల మొక్కలు నాటామని, ప్రస్తుత సంవత్సరం 3 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి స్థాయి నుండి కింది స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటుతున్నారని, నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత సైతం తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2 కోట్ల పైగా మొక్కలు నాటడం జరిగిందని, గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదీ పరివాహక ప్రాంతాలో కొంత ఆలస్యంగా ముక్కొటి వృక్షార్చన కార్యక్రమం ప్రారంభమై, సాయంత్రం వరకు లక్ష్యానికి మించి మొక్కలు నాటమని ఎంపి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలిస్ హౌజింగ్ బోర్డు చైర్మన్ దామోదర్, టి.ఎస్.టి.ఎస్ చైర్మన్ రాకేష్, జడ్పీ చైర్మన్ పుట్టమధు, పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, రామగుండం ఎమ్మేల్యే కోరుకంటి చందర్, రామగుండం మేయర్ అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ అభిషేక్ సింగ్, సింగరేణీ డైరెక్టర్ బలరాం నాయక్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -