మినీ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా..

160
trs
- Advertisement -

తెలంగాణలో మినీ మునిసి‘పోల్స్‌’ ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం సమయానికి కౌంటింగ్ ఊపందుకోగా, టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. నకిరేకల్, కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీలను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది.

నకిరేకల్ మొత్తం 20 వార్డులకు గాను 11 వార్డులు టీఆర్ఎస్ కు దక్కాయి. కొత్తూరు మున్సిపాలిటీలో 12 వార్డుల్లో 7 వార్డుల్లో కారు జోరు చూపించింది. మిగతా వార్డులు కాంగ్రెస్ వశం అయ్యాయి. ఇక జడ్చర్లలో మొత్తం 27 వార్డులుండగా, ఇప్పటివరకు 19 వార్డుల ఓట్లనే లెక్కించారు. అయినప్పటికీ మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకోవడానికి అవసరమైన 16 వార్డులను టీఆర్ఎస్ గెలుచుకుంది. దాంతో మిగతా వార్డుల ఓట్ల లెక్కింపు నామమాత్రమైంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం అచ్చంపేట మున్సిపాలిటీ కూడా టీఆర్ఎస్ ఖాతాలోకే చేరింది. మొత్తం 20 వార్డుల్లో 18 వార్డుల ఓట్లు లెక్కించగా… 11 స్థానాలు గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 6 వార్డులు, బీజేపీ 1 వార్డు గెలుచుకున్నాయి.

మున్సిపల్ కార్పొరేషన్ల విషయానికొస్తే… వరంగల్ కార్పొరేషన్ లో 66 డివిజన్లు ఉండగా, 28 డివిజన్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీఆర్ఎస్ కు 18, బీజేపీకి 7, కాంగ్రెస్ కు 2, ఇతరులకు 1 డివిజన్ దక్కినట్టు తెలిసింది. ఖమ్మం కార్పొరేషన్ లో టీఆర్ఎస్ కు 10, బీజేపీకి 1, కాంగ్రెస్ కు 4 డివిజన్లు వశమయ్యాయి.

కాగా.. ఓట్ల లెక్కింపునకు కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మే 1, 2 తేదీల్లో పరీక్షలు చేయించుకుని నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకున్న వాళ్లను మాత్రమే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించారు. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో సాయంత్రంలోగా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -