బీజేపీ.. కుడితిలో పడ్డ ఎలుకలా ఉంది

199
- Advertisement -

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంలో దొరికిపోయిన బీజేపీదొంగల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం ప్రగతి భవన్లో ఏర్పాటు మీడియా సమావేశంలో మంత్రి హరీశ్‌ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఉన్నారు.

ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ… బీజేపీ వాళ్లు గుమ్మడికాయల దొంగల ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం త‌మ‌కు సంబంధం లేద‌ని చెబుతున్న తెలంగాణ బీజేపీ నాయ‌కులు.. సిట్ ఏర్పాటు చేస్తే ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారంలో ప‌ట్ట‌ప‌గ‌లు దొరికిపోయ‌న‌టువంటి బీజేపీ దొంగల ప‌రిస్థితి కుడితిలో ప‌డ్డ ఎలుక‌ల మారిపోయింది. గుమ్మ‌డికాయ దొంగ ఎవ‌రంటే భుజాలు త‌డుముకున్న‌ట్లుంది. ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌డానికి వ‌చ్చిన మ‌ఠాధిప‌తులు, స్వామిజీలు మాకు తెలియ‌ద‌ని బుకాయించారు. మారు వేషాల్లో వ‌చ్చిన మ‌ఠాధిప‌తులు, స్వామిజీలు త‌మ‌కు తెల్వ‌నే తెల్వ‌ద‌ని బీజేపీ నాయ‌కులు చెప్పారు. ప్ర‌భుత్వం వారిని అరెస్టు చేసి, జైలుకు పంపిన త‌ర్వాత బీజేపీ నాయ‌కుల గొంతుల్లో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డ్డంత ప‌నైంది.

బీజేపీ అధ్య‌క్షుడేమో త‌డి బ‌ట్ట‌ల‌తో ప్ర‌మాణం చేస్తాన‌ని అంటాడు. ఈ కేసును విచార‌ణ చేయొద్ద‌ని బీజేపీ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అంటాడు. ఈ కేసు విచార‌ణ ఆపండి. ఢిల్లీకి ఇవ్వండంటూ కోర్టుల్లో పిటిష‌న్ వేస్తాడు. త‌డిబ‌ట్ట‌లు, పొడిబ‌ట్ట‌లు, ప్ర‌మాణాలు అంటున్నారు. కేసు విచార‌ణ ఆపాల‌నేమో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోర్టుల్లో కేసులు వేస్తాడు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో మ‌ఠాధిప‌తుల‌ను, స్వామిజీల‌ను తెలంగాణ‌లో న‌గ్నంగా ప్ర‌భుత్వం బ‌య‌ట‌పెట్టింది. ఈ కేసుతో మాకు సంబంధం లేద‌ని టీవీ చ‌ర్చ‌ల్లో చెబుతున్నారు. వారెవ‌రో తెలియ‌ద‌ని, వారిని కేసీఆరే పంపిండ‌ని బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రి సంబంధం లేక‌పోతే బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సిట్‌ను ర‌ద్దు చేయ‌మ‌ని ఎందుకు అడుగుతున్నారు. ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు అని ప్ర‌శ్నించారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి ఇవ్వాల‌ని పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రేమేంద‌ర్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. పాద‌ర్శ‌కంగా విచార‌ణ జ‌ర‌గాల‌నే ఉద్దేశంతో సిట్ ఏర్పాటు చేస్తే, ర‌ద్దు చేయాల‌ని కోర్టులో కేసు వేశారు. బీజేపీ బండారం బ‌య‌ట‌ప‌డుత‌ద‌నో ఉద్దేశంతో, దీన్ని ఆపాల‌ని చూస్తున్నారు. ప‌రువు కాపాడుకుందామ‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నిజాన్ని ఒప్పుకోవ‌డ‌మే మీ ముందున్న మార్గం. మ‌రో గత్యంత‌రం లేదు. బీజేపీ నాయ‌కుల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. కేసుతో సంబంధం లేదంటూనే ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి కేసులు ఎందుకు వేస్తున్నారు.

ఢిల్లీ, గ‌ల్లీ నాయ‌కులు గ‌త్త‌ర గ‌త్త‌ర అవుతున్నారు. ఎక్క‌డైనా ఇలాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ప్పుడు.. కేసు త్వ‌ర‌గా విచార‌ణ జ‌ర‌గాల‌ని, నిజ నిజాలు తేల్చాల‌ని డిమాండ్ చేస్తారు. కానీ ద‌ర్యాప్తు మీద స్టే ఇవ్వాల‌ని కోర‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. భార‌త స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం కూడా బీజేపీ బ్రోక‌ర్ల వీడియోల గురించి ప్ర‌స్తావించిన‌ట్లు వార్తా ప‌త్రిక‌లు, టీవీల్లో చూసిన‌ట్లు హ‌రీశ్ రావు పేర్కొన్నారు.

బీజేపీ నాయ‌కులకు తెలంగాణ పోలీసుల మీద విశ్వాసం లేదా? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. తెలంగాణ పోలీసుల మీద కుట్ర‌పూరిత‌మైన వైఖ‌రిని బీజేపీ అవ‌లంభిస్తుంది. దొంగ‌ను ప‌ట్టుకోవ‌డం త‌ప్పా? ఎమ్మెల్యేల‌ను కొంటామ‌ని చెప్పి అడ్డంగా దొరికిపోయిన‌ త‌ర్వాత వారిని అరెస్టు చేయ‌డం త‌ప్పా? గంట‌కో మాట మాట్లాడుతున్నారు. దొరికిపోయి పూట‌కో మాట మాట్లాడుతున్నారు. కోర్టుల్లో ఒక‌టి, ప్రెస్‌మీట్ల‌లో ఒక‌టి, టీవీ చ‌ర్చ‌ల్లో ఒక‌టి మాట్లాడుతున్నారు. బీజేపీ నాయ‌కుల బ‌హురూప వేషాల‌ను, నాట‌కాల‌ను తెలంగాణ ప్ర‌జ‌లు గ‌మ‌నించాలని అన్నారు.

అడ్డంగా దొరికిపోయిన దొంగలు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. సంబంధంలేని కేసు అయితే ఎందుకు కోర్టులకు వెళ్తున్నారు. ప్ర‌జ‌ల‌కు అన్ని విష‌యాలు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతున్నాయి. చిత్త‌శుద్ధి ఉంటే విచార‌ణ‌కు స‌హ‌క‌రించండి. బీజేపీ నాయ‌కులు దొరికిపోయిన దొంగ‌లు. అన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. ధ‌ర్మం, న్యాయం గెలుస్తుంద‌న్న విశ్వాసం మాకుంద‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

గ‌వ‌ర్న‌ర్ తమిళిసై తుషార్ పేరు ఎందుకు ప్ర‌స్తావించారో తెలియ‌దు. మేం మాట్లాడిందేమో రాహుల్ గాంధీ మీద పోటీ చేసి ఓడిపోయిన తుషార్ గురించి. ఆమెనేమో త‌న వ్య‌క్తిగ‌త ఏడీసీ తుషార్ గురించి మాట్లాడారు. తుషార్ ప్ర‌స్తావ‌న ఎందుకు తెచ్చిందో అర్థం కాలేదు. ఆ విష‌యాన్ని ఇవాళ మేం ప‌త్రిక‌ల్లో చూశామ‌ని అన్నారు.

మంత్రి నిరంజన్‌ మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలకు ఉత్తమ విధానాలను రూపొందించి పరిపాలనా చేస్తే తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు తగవన్నారు. మన రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తున్నదని..అది కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. బీజేపీ విధానాల వల్ల ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అన్నారు.

8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి దొడ్డిదారిన అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యమన్నారు. వందలకోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమంటే వాళ్లకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాజ్యంగ బద్ద సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మీకు ఏవిధమైన సంబంధం లేనప్పుడు మీరంతా ఎందుకింతలా భయపడుతున్నారు అని ప్రశ్నించారు.

బీజేపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ను ఏర్పాటు చేస్తే ఎందుకిలా మాట్లాడుతున్నారో వాళ్లకైనా అర్థం అవుతుందో అని అన్నారు. బీజేపీ చేసే పనులను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని మిమల్ని గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. బీజేపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి తీరుతుందన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందన్నారు.

ఇవి కూడా చదవండి..

ఐస్‌ క్రీం అడ్డా తెలంగాణ..కేటీఆర్ ట్వీట్‌

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు..

తెలంగాణకు భారీగా వలసలు

- Advertisement -