కాంగ్రెస్ కే క్లారిటీ లేదా?

46
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. ఈసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి.. అధికారమే లక్ష్యంగా ఉన్న హస్తం పార్టీకి సి‌ఎం అభ్యర్థి ఎవరనేది అంతు చిక్కని ప్రశ్నగానే ఉంది. పార్టీలో బలమైన నేతలకు కొదువేమీ లేదు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదలుకొని జగ్గా రెడ్డి వరకు అందరూ సి‌ఎం పదవికి అర్హులుగానే భావిస్తూ ఉంటారు. ఇదే కాంగ్రెస్ ను కలవర పెడుతున్న అంశం. ఎవరిని సి‌ఎం అభ్యర్థిగా ప్రకటించాలి ? ఒకవేళ ప్రకటిస్తే ఎవరి నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురవుతుంది ? అనే ప్రశ్నలు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాట్లు తెలుస్తోంది. .

బి‌ఆర్‌ఎస్ కు మళ్ళీ కూడా సి‌ఎం అభ్యర్థి కే‌సి‌ఆరే అని ఇప్పటికే ప్రకటించింది ఆ పార్టీ అధిష్టానం, ఇక బీజేపీ కూడా సి‌ఎం అభ్యర్థి విషయంలో జల్లెడ పడుతోంది. ఎటొచ్చీ కాంగ్రెస్ నే ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, వంటి వాళ్ళు సి‌ఎం పదవిపై ఆశగా ఉన్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. బట్టి విక్రమార్క పాదయాత్రతో పార్టీకి గట్టిగానే మైలేజ్ తీసుకొచ్చారు. మరోవైపు రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ హోదాలో పార్టీకి అన్నీ విధాలుగా తన పాత్ర నిర్వర్తిస్తున్నారు. దీంతో వీరిలో సి‌ఎం అభ్యర్థిని ఎంచుకోవడం అధిష్టానానికి కత్తిమీద సామే. ఇదే విషయాన్ని కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ కూడా చెప్పుకొచ్చారు.

సి‌ఎం అభ్యర్థి రేస్ లో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క.. వంటి వాళ్ళందరూ అర్హులేనని ఎవరిని ఎన్నుకోవలో అర్థంకాని పరిస్థితి అని ఆయన చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి సి‌ఎం అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎంత కన్ఫ్యూజన్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరిని సి‌ఎం అభ్యర్థిగా ఎన్నుకున్న ఇతరుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొక తప్పదు. ఎందుకంటే పదవుల విషయంలో మొదటి నుంచి కూడా ఆధిపత్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందువల్ల ఇతరుల నుంచి అసంతృప్తి జ్వాలలు రేకెత్తడం ఖాయంగానే కనిపిస్తోంది. మొత్తానికి అధికారమే లక్ష్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సి‌ఎం అభ్యర్థిని ఎన్నుకోవడంలో క్లారిటీ లేదనేది వాస్తవం.

Also Read:న్యూడ్‌గా నటించదు, కానీ అంతకుమించి

- Advertisement -