కర్ణాటక రాష్ట్ర పర్యటనకు గాను బెంగళూరుకు చేరుకున్న డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు సారధ్యంలోని తెలంగాణ బీసీ కమిషన్ 3 రోజులుగా సంప్రదింపులు, సమాలోచనలు, సమావేశాలతో బిజీ బిజీగా గడిపింది. తొలి రోజు ఇక్కడి బీసీ కమిషన్ సమావేశంతో మొదలైన పర్యటన వివిధ ప్రభుత్వ ముఖ్య అధికారులతో, న్యాయ నిపుణులతో, సామాజిక వేత్తలతో బిజీ బిజీగా గడిపింది. కమిషన్ చైర్మన్ తో పాటు సభ్యులు, సిహెచ్. ఉపేంద్ర, శుభప్రధ్ పటేల్ నూలి, కె. కిశోర్ గౌడ్ ల బృందం తమ పర్యటనను కొనసాగించింది. ఎల్.జి. హవనూర్, వెంకట స్వామి, చిన్నప్ప రెడ్డి కమిషన్ నివేదికలలోని మెథడాలజీలపై కూడా చర్చ. కేంద్రం చేపట్టిన ఎస్.ఇ.సి.సి.(సామాజిక ఆర్థిక మరియు కుల గణన) – 2011 బహిర్గతం చేసి అన్ని రాష్ట్రాలకు అందజేస్తే, రిజర్వేషన్లు న్యాయ పరిశీలనలో నిలబడతాయనే అభిప్రాయం వ్యక్తమయింది.

శుక్రవారం కర్ణాటక బీసీ కమిషన్ పూర్వ చైర్మన్ హెచ్. కాంతరాజ తో స్థానిక నాగురబావిలో ఉన్న అయన గృహంలో సమావేశం అయ్యింది. కాంతరాజ చైర్మన్ గా వున్న సమయంలో 2014-15 సంవత్సరంలో అనేక ఆధునిక పద్దతులలో కర్ణాటక రాష్ట్రం లో కుల గణన చేపట్టడం జరిగింది. దేశంలోని పలు రాష్ట్రాలలో చేపట్టిన గణనలు, సర్వేలకంటే కూడా మరింత శాస్త్రీయ పద్దతులతో చేపట్టడం జరిగిందని కాంతరాజ తెలంగాణ బీసీ కమిషన్ కు తెలిపారు. సుమారు 170 కోట్లు వెచ్చించి, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మొత్తం జనాభాలోని కులాల వారీగా గణనను చేపట్టారు. సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయ రంగాలలో వెనుకబాటుతనాన్ని నిర్దిష్టంగా గణించడం జరిగింది. ఈ సర్వేలో ఆధునిక నిర్దేశిత కొలమానాలు, ఉపకరణాలను ఉపయోగించి వివిధ పద్దతులను ఈ ప్రక్రియ లో ఎలా కొనసాగించాలో కాంతరాజ సోదాహరణంగా తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు వివరించడం జరిగింది. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు అన్ని కోణాలలో సంధించిన ప్రశ్నలకు కాంతరాజ సావధానంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంలోనే ప్రామాణికంగా నిలిచిన సుప్రీమ్ కోర్ట్ తీర్పులు… బాలాజీ వసంత్ కుమార్, ఇంద్ర సాహాని, వికాస్ కిషన్ రావు గౌలి మున్నగు తీర్పులలోని అంశాలపై విశ్లేషణాత్మకంగా వివరణలు ఇచ్చారు, పలు సూచనలు చేశారు కాంతరాజ.
అనంతరం తెలంగాణ కమిషన్ వికాస సౌధలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రష్మీ మహేష్ తో సమావేశం అయ్యారు. వృత్తుల నవీకరణ, అమలు చేస్తున్న పథకాలు, తీరు తెన్నులు, కులాల జాబితా, గ్రూపులు, అమలు చేస్తున్న రిజర్వేషన్ల శాతం, క్రీమి లేయర్ అమలు తదితరాలపై ఆమెతో చర్చించారు. ఇక్కడి ప్రభుత్వం చేపడుతున్న అన్ని కార్యక్రమాలపై సమాచారంను రాబట్టారు. తమకు కావాల్సిన అంశాలపై నిర్దిష్టంగా లేఖలను అందించారు, లిఖిత పూర్వకంగా తమకు అందజేయాలని కోరారు.

