ఫ్రెంచ్ కంపెనీలకు తెలంగాణ ప్రతినిధి బృందం ఆహ్వానం..

140
- Advertisement -

మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న తెలంగాణ ప్రతినిధి బృందం వివిధ ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో వరుస సమావేశాలు నిర్వహించింది. సర్వియర్ (Servier) సంస్థ యాజమాన్య బృందంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. సర్వియర్ హెడ్- ఓపెన్ ఇన్నోవేషన్ & సైంటిఫిక్ అఫైర్స్ డాక్టర్ ఒలివియర్ నోస్జీన్, హెడ్- కెమిస్ట్రీ మాన్యుఫ్యాక్చరింగ్ & కంట్రోల్, R&D VP పాట్రిక్ జెనిసెల్, MD ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఆఫ్ సౌత్ ఏషియా & ఆస్ట్రేలియా బెర్నార్డ్ పరిన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

€4.7 బిలియన్ యూరోల ఆదాయంతో, ఫ్రాన్స్‌లో 2వ అతిపెద్ద ఫార్మాసూటికల్ గ్రూప్ గా ఉన్న సర్వియర్ సంస్థ 150 దేశాల్లో తమ కార్యకలాపాలు సాగిస్తోంది. తెలంగాణలో ఉన్న పటిష్టమైన లైఫ్ సైన్సెస్, ఫార్మా ఎకోసిస్టమ్ గురించి మంత్రి కేటీఆర్ సర్వియర్ ప్రతినిధి బృందానికి వివరించారు. పరిశ్రమలను, విద్యాసంస్థలను అనుసంధానం చేసే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH) వంటి తెలంగాణ ప్రభుత్వ వినూత్న కార్యక్రమాల గురించి మంత్రి వారికి వివరించారు.2022 బయో ఏషియా సదస్సు లో పాల్గొనాలని ఆహ్వానం పలుకుతూ, పరస్పర సహకారం కోసం వేదికలను తయారు చేసుకోవాలని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు.

ఆ తరువాత మంత్రి కేటీఆర్ పారిస్‌లోని సఫ్రాన్ (SAFRAN) ప్రధాన కార్యాలయంలో సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌ల CEO జీన్ పాల్ అలారీ, ఆ కంపెనీ సీనియర్ EVP, ఇంటర్నేషనల్ & పబ్లిక్ అఫైర్స్, H.E అలెగ్జాండ్రే జీగిల్ మరియు భారతదేశంలోని ఫ్రాన్స్ మాజీ రాయబారి లతో సమావేశమయ్యారు.ఫ్రెంచ్ బహుళజాతి ఎయిర్‌క్రాఫ్ట్ & రాకెట్ ఇంజన్, ఏరోస్పేస్ కాంపోనెంట్, డిఫెన్స్ మరియు సెక్యూరిటీ కంపెనీలో భాగమైన “సఫ్రాన్ ఎలక్ట్రికల్ & పవర్” ఇటీవల హైదరాబాద్‌లో తన ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ ఫెసిలిటీని విస్తరించింది.

ఈ సమావేశంలో తెలంగాణలో ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలకు దోహదకారిగా ఉండేలా నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై మంత్రి వారితో చర్చించారు. ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఎయిర్ అటాషే ఎయిర్ కమోడోర్ హిలాల్ అహ్మద్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.పారిస్‌లో జరుగుతున్న యాంబిషన్ ఇండియా ఈవెంట్‌లో భాగంగా ఫ్రెంచ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఆసియా అండ్ మిడిల్ ఈస్ట్ డైరెక్టర్ ఫిలిప్ ఓర్లియాంజ్‌తో మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశమైంది.

ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న పలు కార్యక్రమాలకు ఆర్థికంగా అండగా ఉండే ఫ్రెంచ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (AFD) కి చెందిన బృందాలు 115 దేశాలలో 4,000 కంటే ఎక్కువ ప్రాజెక్ట్‌లలో పాల్గొంటున్నాయి. అనంతరం థేల్స్ గ్రూప్ ఈవీపీ మార్క్ డార్మన్, ఇండియా సీఈవో ఆశిష్ సరాఫ్‌తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.

శతాబ్దానికి పైగా గొప్ప చరిత్రను కలిగి ఉన్న “థేల్స్” ఒక ప్రముఖ ఫ్రెంచ్ బహుళజాతి సంస్థ. ఈ కంపెనీ ఐదు వర్టికల్స్ లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అవి…డిజిటల్ ఐడెంటిటీ & సెక్యూరిటీ, డిఫెన్స్ & సెక్యూరిటీ, ఏరోస్పేస్, స్పేస్ & ట్రాన్స్‌పోర్ట్. ఐదు ఖండాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ థేల్స్ సంస్థలో 80,000 మందికి పైగా ఉద్యోగు లున్నారు.

వివిధ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో తెలంగాణ ముందడుగు వేయడం గురించి, WEF సహకారంతో తెలంగాణలో ఇటీవల ప్రారంభించిన మెడిసిన్ ఫ్రమ్ స్కై ప్రాజెక్ట్ గురించి ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ చర్చించారు.అనంతరం మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం కియోలిస్ సీఈవో మిస్టర్ బెర్నార్డ్ టాబరీతో సమావేశమయ్యారు.

షేర్ డ్ మొబిలిటీ రంగంలో ప్రపంచలోని అగ్రగణ్య సంస్థలలో కియోలిస్ ఒకటి. కియోలిస్ గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ అయిన కియోలిస్ హైదరాబాద్, హైదరాబాద్ మెట్రోకు ఆపరేషన్స్ & మెయింటెనెన్స్ లో భాగస్వామి. 300 ఆర్గనైజింగ్ అథారిటీల తరపున కియోలిస్ సంస్థ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్‌లను నిర్వహిస్తోంది. ఈ సంస్థ కార్యకలాపాలు 5 ఖండాలు, 16 దేశాలకు విస్తరించిఉన్నాయి.
ఆటోమేటిక్ మెట్రో మరియు ట్రామ్‌వేలలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న ఈ గ్రూప్, మెడికల్ ట్రాన్స్‌పోర్ట్‌లో, ఫ్రాన్స్‌లోని గ్లోబల్ పార్కింగ్ కాంట్రాక్ట్‌లలో కూడా నంబర్ 1 గా ఉంది. ప్రతి సంవత్సరం 3 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఈ సంస్థ షేర్డ్ మొబిలిటీ సేవలను ఉపయోగిస్తున్నారు.

ఆ తర్వాత మంత్రి కేటీఆర్ ష్నైడర్ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ – లూక్ రిమోంట్‌ను కలిశారు. Schneider Electric ఎనర్జీ మరియు ఆటోమేషన్ డిజిటల్ సొల్యూషన్స్ అందించే ప్రముఖ ఫ్రెంచ్ బహుళజాతి సంస్థ. 100 కంటే ఎక్కువ దేశాలలో కార్యకలాపాలను కలిగి ఉండి, లక్షా ముప్పై అయిదు వేలకు పైగా ఉద్యోగులున్న ష్నైడర్‌ సంస్థ కు హైదరాబాద్ లో తయారీ కేంద్రం ఉంది. దీనికి అనుబంధ సంస్థ గా ఉన్న కంపెనీ AVEVA హైదరాబాద్‌ లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో జరిగిన సమావేశాలు ఫలప్రదం అయ్యాయి. తెలంగాణలో పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి వారిని ఆహ్వానించారు.ఈ సమావేశాల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఏరోస్పేస్ & డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు.

- Advertisement -