IND vs ENG :విక్టరీ..రెండోస్థానంలో టీమిండియా!

14
- Advertisement -

రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 434 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును మట్టి కరిపించింది. యువ సంచలనం యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా 557 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది. అయితే లక్ష్య చేధనలో ఇంగ్లీష్ జట్టు కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలింగ్ విభాగంలో జడేజా ఏకంగా ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించగా. కుల్దీప్ రెండు వికెట్లు, బుమ్రా, అశ్విన్ తలో వికెట్ తీసి టీమిండియా విజయానికి బాటలు వేశారు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఈ టెస్టు గెలుపుతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఏకంగా రెండో స్థానానికి చేరుకుంది.

మొదటి స్థానంలో ఆస్ట్రేలియా ఉండగా, రెండో స్థానంలో టీమిండియా, మూడో స్థానంలో ఇంగ్లాండ్, నాలుగో స్థానంలో సౌతాఫ్రికా, ఐదో స్థానంలో న్యూజిలాండ్.. జట్లు కొనసాగుతున్నాయి. వరుసగా రెండు టెస్టులలో కూడా టీమిండియా విజయం సాధించడంతో ప్రస్తుతం ఆటగాళ్లు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇదే దూకుడు నాలుగో టెస్టులో కూడా కొనసాగించాలని చూస్తున్నారు. ఈ నెల 23 నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధిస్తే టీమిండియా టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది.

ఫోకస్ అంతా జైస్వాల్ పైనే..
ప్రస్తుతం నిలకడైన ఆటతీరుతో వరుస డబుల్ సెంచరీలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్న యశస్వి జైస్వాల్.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 23 ఏళ్ల వయసులోనే అత్యధిక సార్లు 150కి పైగా పరుగులు చేసిన బ్యాటర్ గా జైస్వాల్ నిలిచాడు. మరి ఇదే దూకుడుతో నాలుగో టెస్టులో కూడా డబుల్ సెంచరీ సాధించి వరుసగా ఈ ఘనత సాధించిన మొదటి బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టిస్తాడోమే చూడాలి.

Also Read:ఇలా చేస్తే ఊపిరితిత్తుల ఆరోగ్యం.. పదిలం!

- Advertisement -