విజయ్దేవరకొండ, రీతూ వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘పెళ్లిచూపులు’ మూవీ బాక్సాపీస్ వద్ద సూపర్హిట్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీని తమిళ్ లో రీమేక్ చేసేందుకు.. దర్శకుడు గౌతమ్ మీనన్ రైట్స్ కొనుక్కున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో రీతు వర్మ రోల్ కు.. తమన్నాను తీసుకుంటారనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడది ఓకే అయిపోయింది.

ఇటీవల పెళ్లి చూపులు రీమేక్ కు ‘పొన్ ఒండ్రు కందేన్’ అనే టైటిల్ ను ప్రకటించేశాడు గౌతమ్ మీనన్. ఇక హీరోగా విష్ణు విశాల్.. హీరోయిన్ గా తమన్నా నటించబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ రీమేక్ షూటింగ్ ప్రారంభం కానుంది. గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి నిర్మాతగా.. సెంథిల్ వీరాస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఇక గౌతమ్ మీనన్ మూవీలో పని చేయడం థ్రిల్లింగ్ అని చెబుతోంది మిల్కీ బ్యూటీ. ‘నేను గౌతమ్ మీనన్ వర్క్ కి విపరీతమైన ఫ్యాన్ ని. ఆయన సినిమాల్లో మహిళలను చూపించే విధానం అద్భుతంగా ఉంటుంది. గౌతమ్ తో కలిసి పని చేయడం.. నాకు సుదీర్ఘం కాలంగా ఉన్న కోరిక. రొమాన్స్ జోనర్ ను ఆయన చూపినట్లుగా మరెవరూ చూపలేరు’ అని చెబుతోంది మిల్క్ బ్యూటీ. గౌతమ్ వాసుదేవ్ మీనన్ నిర్మించనున్న ఈ మూవీని వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు సమాచారం. పెళ్లి చూపులు మూవీకి తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహించారు.

