సూర్య కుమార్ నేతృత్వంలోని భారత జట్టు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో విజయం సాధించడానికి వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు సూర్యకుమార్. భారత జట్టు ఫీల్డింగ్ మెరుగుపడేందుకు ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ ప్రత్యేకంగా ఒక బహుమతి పద్ధతిని ప్రవేశపెట్టినట్లు ఆయన చెప్పారు.
టోర్నమెంట్ ప్రారంభంలో భారత జట్టు ఫీల్డింగ్ అంతగా మెరుగ్గా లేదని, ముఖ్యంగా క్యాచ్లు వదిలేయడం ఎక్కువగా జరిగిందని సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. టోర్నమెంట్ మధ్యలో క్యాచ్ల విజయశాతం కూడా ఇతర అగ్ర జట్లతో పోలిస్తే తక్కువగానే ఉందన్నారు. అయితే ఆ పరిస్థితిని మార్చేందుకు ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ వినూత్న ఆలోచన తీసుకొచ్చారు.
ప్రాక్టీస్ సెషన్లలో ఉత్తమ ఫీల్డర్కు రూ.10,000 బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఈ చిన్న ప్రోత్సాహకం ఆటగాళ్లలో పోటీ భావన పెంచి క్యాచ్లు పట్టే సామర్థ్యాన్ని మెరుగుపరచిందని సూర్య తెలిపారు.
సెమీఫైనల్లో అక్షర్ పటేల్ తీసుకున్న అద్భుత క్యాచ్ మ్యాచ్ మలుపు తిప్పిందని ఆయన గుర్తు చేశారు. అలాగే బౌండరీ దగ్గర చేసిన అద్భుత ఫీల్డింగ్తో విల్ జాక్స్ను ఔట్ చేయడం కూడా భారత్కు విజయంలో కీలకమైందన్నారు.
సోషల్ మీడియా ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొంతమంది ఆటగాళ్లు టోర్నమెంట్ మధ్యలోనే సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించారని, డ్రెస్సింగ్ రూమ్లో టీవీ కూడా ఆఫ్ చేసి ఇతర మ్యాచ్లను చూడకుండా ఉండేందుకు ప్రయత్నించామని సూర్యకుమార్ తెలిపారు.
Also Read:ప్రజల కోరిక మేరకే ‘కేరళం’గా మార్పు!

