పీవీకి, కేసీఆర్‌కు ఎన్నో పోలికలున్నాయి- వాణి దేవి

195
Surabhi Vani Devi
- Advertisement -

మాజీ ప్రధాని పీవీకి, సీఎం కేసీఆర్‌కు ఎన్నెన్నో పోలికలున్నాయి..! పీవీ దేశాన్ని గట్టెక్కించారు.. సీఎం కేసీఆర్‌ తెలంగాణను కాపాడారు అని హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణి దేవి కొనియాడారు. శుక్రవారం వాణీదేవి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి పీవీ నరసింహారావుకు, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అనేక అంశాల్లో పోలికలున్నాయని తెలిపారు. తన తండ్రి పీవీ రైతు అని, సీఎం కేసీఆర్ కు కూడా వ్యవసాయం అంటే ఎంతో మక్కువ అని వివరించారు. పీవీ సంస్కరణాభిలాషి అని, కేసీఆర్ కూడా సంస్కరణలు కోరుకునే వ్యక్తి అని పేర్కొన్నారు.

తన తండ్రికి 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్నా, మాతృభాష, యాస ఎప్పుడూ విడిచిపెట్టలేదని వాణీదేవి అన్నారు. ఇంటికి వస్తే ఆయన తెలంగాణ యాసలోనే మాట్లాడేవారని తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా భాష కోసం, యాస కోసం ఎంతో తాపత్రయం చూపుతారని, భాష, యాస మనుగడను ఆయన పరిరక్షించారని కొనియాడారు. తెలంగాణ భాషనే అసలైన తెలుగు భాషగా చెప్పే స్థాయికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. పీవీ, కేసీఆర్ ఇద్దరూ సాహిత్యం పట్ల అభిలాష ఉన్నవారేనని వాణీదేవి వివరించారు. నాడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించిన వ్యక్తి పీవీ అయితే, తెలంగాణను సాధించి, రక్షించిన మహానుభావుడు కేసీఆర్ అని వాణి దేవీ పేర్కొన్నారు.

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ నియోజకవర్గలతో నాకు చాల అనుబంధం ఉంది. పట్టాభద్రుల సమస్యలు నాకు తెలుసని.. ప్రజల సమస్యలపై పోరాడుతానని వాణి దేవి తెలిపారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. పట్టాభద్రులకు అండగా నిలుస్తానని వాణి దేవి తెలిపారు.

- Advertisement -