అతిలోక సుందరి శ్రీదేవి ఇక లేరు..

282
- Advertisement -

లెజండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి ఇక లేరు. బాలీవుడ్ నటుడు మొహిత్ మార్వా వివాహం నిమిత్తం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషి కపూర్‌తో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. సడెన్‌గా హార్ట్ ఎటాక్ రావడంతో ఈ లోకం విడిచి వెళ్లినట్లుగా బాలీవుడ్ వర్గాలు ప్రకటించాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుబాయ్‌లో ఆమె కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రసీమలను కొన్నేళ్లు ఏలిన అతిలోకసుందరి శ్రీదేవి భువి నుంచి దివికి వెళ్లిపోవడం సినీ ప్రేక్షక లోకాన్ని విషాదంలోకి నెట్టింది.

తమిళనాడులోని శివకాశిలో ఆగస్టు 13న శ్రీదేవి జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మయ్యంగార్‌ అయ్యప్పన్‌. 1967లో బాలనటిగా ‘కన్దన్‌ కరుణాయ్‌’ అనే తమిళ చిత్రం ద్వారా మొదటిసారి వెండితెరపై కనిపించారు. 1976లో కె.బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘మాండ్రు ముడిచు’లో కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌లతో కలిసి నటించి స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ‘పదహారేళ్ల వయసు’, హిందీలో ‘సోల్వా సావన్‌’.. హీరోయిన్‌గా ఆమెకు తొలి చిత్రాలు. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాల్లో నటించారు. 1975-85 మధ్యకాలంలో తెలుగు, తమిళంలో ఆమె నెంబర్‌ వన్‌ కథానాయిక స్థానానికి ఎదిగారు. ఆయా భాషల్లో అగ్ర కథానాయకులందరితోనూ శ్రీదేవి నటించారు. రెండు తరాల హీరోలతో నటించిన హీరోయిన్‌గా ఆమె పేరు తెచ్చుకున్నారు.

superstar Sridevi is dead

సినిమాల్లో ఎంత పేరైతే తెచ్చుకున్నారో వ్యక్తిగత జీవితంలో అన్ని ఇబ్బందులు పడ్డారు. శ్రీదేవి చిన్నప్పటి నుంచి అమ్మంటే ప్రాణం. ఆమెకి తల్లితో ఉన్న అనుబంధం ఎక్కువ. ఆమె మరణం తనకు తీరని లోటని శ్రీదేవి చెబుతుండేవారు. తల్లి మరణం తర్వాత శ్రీదేవి బాలీవుడ్‌ నిర్మాత, హీరో అనిల్‌ కపూర్‌ సోదరుడు బోనీకపూర్‌ను 1996జూన్‌ 2న వివాహం చేసుకున్నారు. వారికి జాహ్నవి, ఖుషి ఇద్దరు పిల్లలు.

పెళ్లి తర్వాత సినిమా కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశారు శ్రీదేవి. అయితే 2004-05 మధ్యకాలంలో మాలినీ అయ్యర్‌గా బుల్లితెర మీద కొద్దికాలం ప్రత్యక్షమయ్యారు. శ్రీదేవి నటించడం వల్లే మాలినీ అయ్యర్‌ పాత్ర బాగా పాపులర్‌ అయింది. ఆ సీరియల్‌ అయిపోయాక రెండు మూడుసార్లు టీవీ షోలకు హాజరుకావడం తప్ప నటిగా మళ్లీ తెర మీదకు రాలేదు. అయితే, నిర్మాతగా ‘పోకిరి’ చిత్రాన్ని హిందీలో సల్మాన్‌తో ‘వాంటెడ్‌’గా నిర్మించారు. 2012లో వచ్చిన ‘ఇంగ్లీష్‌-వింగ్లీష్‌’ చిత్రం ద్వారా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇటీవలే ‘మామ్‌’ చిత్రంతో మరోసారి అలరించారు. ప్రస్తుతం ఆమె పెద్ద కుమార్తె జాన్వీని వెండితెరకు పరిచయం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. మరాఠాలో ఘన విజయం సాధించిన ‘సైరాట్‌’ సినిమాను హిందీలో ‘దడాక్‌’ పేరుతో రిమేక్‌ చేస్తున్నారు. కరణ్‌ జోహర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మృతిపట్ల బాలీవుడ్‌తో పాటు, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

superstar Sridevi is dead

తన నటనతో ఎన్నో ప్రశంసలు అందుకున్న శ్రీదేవిని పలు అవార్డులు కూడా అందుకున్నారు. నటనకు ఆమె చేసిన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2013లో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది. ఇక శ్రీదేవి తన సినీ కెరీర్‌లో 14 సార్లు ఫిలింఫేర్‌కు నామినేట్‌ కాగా, నాలుగు సార్లు ఉత్తమనటిగా, రెండుసార్లు స్పెషల్‌ జ్యూరీ లభించాయి. ఇందులో తెలుగులో ఆమె నటించిన ‘క్షణక్షణం’ చిత్రానికి ఉత్తమ నటిగా నంది అందుకున్నారు. అంతేకాకుండా ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానెల్‌ సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌ జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘ఇండియాస్‌ గ్రేటెస్ట్‌ యాక్ట్రెస్‌ ఇన్‌ 100 ఇయర్స్‌’గా శ్రీదేవి ఎంపికయ్యారు.

- Advertisement -