ఏపీలో ‘రాళ్ళ రాజకీయం’!

18
- Advertisement -

మరికొద్ది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికారమే లక్ష్యంగా ఇటు వైసీపీ, అటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి గట్టి ప్రయత్నలే చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో బస్సు యాత్రలో భాగంగా సి‌ఎం జగన్ పై రాయి దాడి జరిగిన సంగతి విధితమే. అయితే ఈ దాడి ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ? దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి ? అనేది ఎవరికి అంతుచిక్కడం లేదు. జగన్ పై జరిగిన దాడి వెనుక చంద్రబాబు హస్తం ఉందని, జగన్ కు వస్తున్న ప్రజాధరణను ఓర్వలేక చంద్రబాబు దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే జగన్ పై జరిగిన దాడి వైసీపీ వ్యూహంలో భాగమని, గత ఎన్నికల టైమ్ లో కోడికత్తి డ్రామా మాదిరి ఏ ఎన్నికల్లో రాళ్ళదాడిని తెరపైకి తెచ్చి లభ్ది పెంచే ప్రయత్నం టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. .

ఇదిలా ఉంచితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కూడా విశాఖ పర్యటనలో రాళ్ళ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అటు పవన్ పై తెనాలి నియోజక వర్గ ప్రచారంలో రాయి దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మూడు పార్టీల అధినేతలపై రాళ్ల దాడులు హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే ఎన్నికల ప్రచారంలో చిన్న చిన్న అవాంతరాలు చోటు చేసుకోవడం సహజం. కానీ వాటిని భూతద్దంలో చూపిస్తూ రాజకీయ లబ్ధి కోసం మూడు పార్టీలు ఆరాటపడుతున్నాయనేది కొందరి అతివాదుల అభిప్రాయం. అయితే గతంలో కూడా ఎన్నికల ప్రచారల్లో కొంతమంది నేతలపై కోడిగుడ్లు విసరడం, చెప్పులు విసరడం వంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు రాళ్లు విసరడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. మరి ముందు రోజుల్లో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

- Advertisement -