శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

24
- Advertisement -

శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శనివారం శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. ముందుగా సాయంత్రం సేనాధిపతివారిని ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంతమండపానికి వేంచేపు చేశారు. అనంతరం మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీవారి మూలవిరాట్‌ ఎదుట ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వ‌హించారు. భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతలు కేటాయించారు. అంకురార్పణ కారణంగా శనివారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.

Also Read:గొప్ప సందేశం ఉన్న చిత్రం.. ‘ఓటు’

- Advertisement -