కొన్ని వారాల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాల మీద సంచలనాలు సృష్టించిన సినీ నటి శ్రీరెడ్డి కొద్దిరోజులుగా మీడియాలో కనిపించటం లేదు. క్యాస్టింగ్ కౌచ్ తో పాటు మా సంస్థలో సభ్యత్వం ఇవ్వాలంటూ పోరాడిన ఆమెకు కొన్ని టీవీ ఛానళ్లు ప్రయారిటీ ఇవ్వటం.. ఆ ఇష్యూపై వారాలకు వారాలు గంటల కొద్దీ చర్చలు జరపటం తెలిసిందే.
శ్రీ రెడ్డికి న్యాయపోరాటం చేయమని పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఆమె సోషల్ మీడియాలో ఆయన మీద కామెంట్లు చేస్తూనే ఉండగా.. మరోవైపు పోలీసులను కూడా ఆశ్రయిస్తోంది. తాజాగా ఆమె పోలీసులకు కొందరి మీద ఫిర్యాదు చేసింది.
అయితే ఈ ఫిర్యాదు సినీనటి.. దర్శకురాలు జీవితారాజశేఖర్.. హేతువాది బాబు గోగినేనితో సహా పలువురు సినీనటులు.. ఆర్టిస్టులు.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలపై మొత్తం 28 మంది మీద శ్రీరెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆదివారం ఆసిఫ్ నగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తికి ఫిర్యాదు చేశారు. తనపై ఇప్పటికి సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ లలోనూ దుష్ప్రచారం చేస్తున్నారని .. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సినీ ప్రముఖులపై ఫిర్యాదు చేయటం ద్వారా శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకి వచ్చారని చెప్పాలి.