హైదరాబాద్‌ చేరుకున్న స్పుత్నిక్ వి టీకాలు..

214
sputnik-v
- Advertisement -

రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి కరోనా టీకాలు ఆదివారం భారత్‌కు చేరుకున్నాయి. రెండో విడత కింద 60 వేల టీకా డోసులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. ఇప్పటికే తొలి విడత కింద 1.50 లక్షల డోసులు మే 1న భారత్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత్‌లోని రష్యా రాయబారి నికోలాయ్‌ కుడషేవ్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌పై పోరులో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం పటిష్ఠంగా ముందుకు సాగుతోందన్నారు. రష్యాల్లో 2020 ద్వితీయార్ధం ప్రారంభం నుంచే ఈ వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

కరోనాను సమర్థంగా ఎదుర్కోవడంలో టీకా మెరుగ్గా పనిచేస్తోందని పేర్కొన్నారు. అలాగే కొత్త వైరస్‌ రకాలపైనా ఈ టీకాల పనిచేస్తుందని తెలిపారు. భారత్‌లో దీని తయారీని దశలవారీగా ఏడాదికి 850 మిలియన్‌ డోసులకు పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. అలాగే త్వరలో భారత్‌లో సింగిల్‌ డోస్‌ స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యత్నాలు జరుగుతున్నాయన్నారు.

కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌తో పాటు భారత్‌లో అత్యవసర వినియోగానికి అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి. భారత్‌లో దీని తయారీ, పంపిణీకి డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో ఒప్పందం కుదుర్చుకొంది. డాక్టర్‌ రెడ్డీస్‌కు తొలి విడతగా 1.5 లక్షల డోసుల ‘స్పుత్నిక్‌ వి’ టీకా ఈ నెల 1వ తేదీన దిగుమతి అయింది. వాటిని పంపిణీ చేయడానికి హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని కసౌలిలో ఉన్న సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబొరేటరీ ఈ నెల 13న అనుమతినిచ్చింది. దీంతో టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ‘డాక్టర్‌ రెడ్డీస్‌’ చేపట్టింది. డాక్టర్‌ రెడ్డీస్‌లో కస్టమ్‌ ఫార్మా సర్వీసెస్‌ వ్యాపార విభాగానికి అధిపతిగా ఉన్న దీపక్‌ సప్రా తొలి ‘స్పుత్నిక్‌ వి’ డోసు తీసుకున్నారు.

- Advertisement -