లాక్ డౌన్ అమలు తీరుపై స్పీకర్ పోచారం సమీక్ష..

199
pocharam
- Advertisement -

రాష్ట్రంలో లాక్ డౌన్‌తో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గాయని అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ గ్రామీణ మండలం, బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై హైదరాబాద్‌లోని తన అధికార నివాసం నుంచి వీడియో కాల్ ద్వారా ఆయన మాట్లాడారు. లాక్ డౌన్ అమలు తీరుపై స్పీకర్ సమీక్షించారు. కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

బాన్సువాడ పట్టణంతో పాటు గ్రామాలలో కూడా లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేయాలని సూచించారు. కరోనా కట్టడి విషయంలో ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యం చేయాలన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా నుంచి రక్షణ పొందవచ్చు. అందుకే ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.

వానాకాలం మొదలైనందున పంటల సాగుకు సమాయత్తం కావాలని సూచించారు. వానాకాలం పంటను జూన్ నెలలో నాట్లు వేయడం ద్వారా నవంబర్ నెల తుఫాను లను తప్పించుకోవడానికి వీలవుతుందన్నారు. ఈ దిశలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అవసరమైన విత్తనాలు, ఎరువులను అవసరమైన మేరకు ముందుగానే నిల్వ చేసుకోవాలని సూచించారు.

రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణంపై గ్రామాలు, పట్టణంలోని వార్డుల వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు అవసరమైన సామగ్రిని అందజేయాలని, త్వరితంగా నిర్మాణాలు పూర్తి అయ్యేవిదంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అదేవిదంగా గ్రామాలలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా సమాచారం తెలుసుకుని తగు సూచనలను చేశారు.

- Advertisement -