మంత్రి కేటీఆర్‌ను కలిసిన నటుడు సోనూసూద్‌..

164
ktr
- Advertisement -

కోవిడ్ కష్టకాలంలో ఎంతోమందిని ఆదుకొని రియల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు బహుభాషా నటుడు సోనూసూద్‌. ఇయన మంగళవారం మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలుసుకున్నారు.ఈ సమావేశంలో సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించడమే కాకుండా.. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ఆయన పనిచేస్తున్న తీరుని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఈ సందర్భంగా సోనూసూద్ తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను, ఈ సేవా రంగంలో తన భవిష్యత్తు ప్రణాళికలను మంత్రి కేటీఆర్‌తో పంచుకున్నారు. తన తల్లి స్పూర్తితో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల తన అనుబంధాన్ని కేటీఆర్‌కు సోనూసూద్ తెలియజేశారు. ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణకి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడంలో కీలక పాత్ర వహిస్తూనే, ఇతరులకంటే భిన్నంగా కష్ట సమయాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి, వారిని ఆదుకుంటున్న మంత్రి కేటీఆర్ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని సోనుసూద్ అన్నారు. ఈ సమావేశానంతరం మంత్రి కేటీఆర్, సోనూసూద్‌కు లంచ్ ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన చేస్తున్న సేవ కార్యక్రమాలకు అభినందనగా శాలువాతో సత్కరించి.. ఒక జ్ఞాపికను మంత్రి కేటీఆర్ అందజేశారు.

మంత్రి కే. తారకరామారావు మరియు సోనూసూద్ సమావేశంలో దర్శకులు వంశీ పైడిపల్లి, మెహర్‌ రమేష్‌, తెలంగాణ పర్యాటక మరియు యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -