ఈ సినిమాకి ఆ రెండే ప్లస్‌ పాయింట్స్‌..

330
- Advertisement -

మాస్టర్‌ రాయగిరి సహర్ష్‌ గౌడ్‌ సమర్పణలో శ్రీశ్రీ నాగలక్ష్మీ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాయగిరి ఉమాపతి గౌడ్‌ నిర్మాతగా, జింకా హరిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సోగ్గాడే శోభన్‌ కృష్ణ’. ఈ సినిమా ఆడియో రిలీజ్‌ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ ఆడియో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్‌ దర్శకులు సాగర్‌, సీనియర్‌ నటులు నారాయణ రావు పాల్గొన్నారు. ఆడియో సీడిని దర్శకులు సాగర్‌ ఆవిష్కరించి నారాయణరావుకి అందజేశారు.
  Soggade Sobhan Krishna movie
ఈ సందర్భంగా దర్శకులు సాగర్‌ మాట్లాడుతూ – ”ఈ సినిమాకి రెండు ప్లస్‌ పాయింట్స్‌ వున్నాయి. ఒకటి శోభన్‌, రెండు కృష్ణ. టైటిల్‌ చాలా బావుంది. వాళ్లిదరి ఫ్యాన్స్‌ చూసినా కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అవుతుంది. దర్శకుడు హరిబాబు నాకు కథ చెప్పడం జరిగింది. చాలా బావుంది. ఏ సినిమాకైనా సబ్జెక్ట్‌ చాలా ముఖ్యం. ఈ చిత్రంలోని పాటలు బాగున్నాయి. సంగీత దర్శకుడు ఆర్‌.సి.కుమార్‌ చక్కని సంగీతాన్ని అందించారు. సినిమాకి వర్క్‌ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సీనియర్‌ నటుడు నారాయణరావు మాట్లాడుతూ – ”మంచి కథతో తీసిన సినిమా ఎప్పుడూ హిట్‌ అవుతుంది. అందుకు ఉదాహరణ మేమే. అందరం కొత్తవాళ్లమైనప్పటికీ ‘అంతులేని కథ’ ఎంత హిట్‌ అయ్యిందో అందరికీ తెల్సిందే. సినిమాల్లో చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఉండదు. మంచి సినిమా అనేదే వుంటుంది. పాటలు బావున్నాయి. దర్శకుడు హరిబాబు చిత్రాన్ని బాగా తెరకెక్కించారు. సినిమా హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.
 Soggade Sobhan Krishna movieదర్శకుడు జింకా హరిబాబు మాట్లాడుతూ – ”ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కథ. యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన చిత్రం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసుకుంది. లో బడ్జెట్‌లో తెరకెక్కిన మంచి సినిమా ఇది. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చిత్రాన్ని నిర్మించాం. నిర్మాత ఉమాపతిగౌడ్‌గారు చిత్రం బాగా రావడానికి ఎంతో సహకరించారు. ఫ్యామిలీ సెంటిమెంట్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది” అన్నారు.

హీరో మాట్లాడుతూ – ”స్టేజి ఆర్టిస్ట్‌ అయిన నేను సినిమాలో నటించాలని చాలా కోరికగా వుండేది. అది ఈ సినిమాతో తీరింది. నిర్మాతగా, హీరోగా నేనే ఈ సినిమాని తీశాను. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో నేనే ముందుకు రావడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకులు సాగర్‌గారికి ధన్యవాదాలు. సహకరించిన టెక్నీషియన్స్‌ అందరికీ నా కృతజ్ఞతలు” అన్నారు. లహరి ఆడియో ద్వారా ఈ చిత్రంలోని పాటలు విడుదల అయ్యాయి. ఈ కార్యక్రమానికి పాటల రచయిత రామ్‌, సంగీత దర్శకుడు ఆర్‌.సి.కుమార్‌, హీరోయిన్‌ ఝాన్సీ, నటుడు వంశీ, నందినిలతో పాటు చిత్ర యూనిట్‌ పాల్గొంది.

- Advertisement -