సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు.. ఉత్తర్వులు జారీ..

214
Singareni-Collieries
- Advertisement -

సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతూ యాజమాన్యం గురువారం (ఆగస్టు 12వ తేదీ) నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ అధ్యక్షతన ఇటీవల జరిగిన సింగరేణి బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచేందుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించిన విధి విధానాలతో కూడిన ఉత్తర్వులను డైరెక్టర్‌(పర్సనల్‌) శ్రీ ఎన్‌.బలరామ్‌ విడుదల చేశారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది మార్చి 31 తేదీ తర్వాత పదవీ విరమణ పొందిన ప్రతీ ఒక్క ఉద్యోగి, అధికారి తిరిగి విధుల్లో చేరడానికి అవకాశం కల్పించారు. ఈ నెల 31వ తేదీ లోగా విధుల్లో చేరాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఉద్యోగాల్లో చేరనిపక్షంలో తిరిగి విధుల్లో చేరే అవకాశం ఉండదని చెప్పారు. పదవీ విరమణ పొందిన తేదీ నుంచి తిరిగి విధుల్లో చేరే తేదీ మధ్య కాలాన్ని ‘‘నో వర్కు- నో’’ పే గా పరిగణిస్తారు. కానీ ఆ కాలాన్ని కంపెనీ సర్వీసుగానే గుర్తించడం జరుగుతుంది. పదవీ విరమణ పొంది తిరిగి విధుల్లో చేరే వారి పింఛన్‌ ను నిలుపుదల చేసేలా సీఎంపీఎఫ్‌ అధికారులను సింగరేణి కోరనుంది. తిరిగి విధుల్లో చేరేందుకు వచ్చే ఉద్యోగులు, అధికారులకు కోల్‌ మైన్స్‌ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. సమగ్ర విధి విధానాలతో కూడిన ఉత్తర్వులను కంపెనీ వ్యాప్తంగా అన్ని గనుల కార్యాలయాలు, నోటీసు బోర్డులపై కార్మికులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది.

ఈపీ ఆపరేటర్లు, ఎంవీ డ్రైవర్లు విధుల్లో చేరిన నెల రోజుల్లోగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. పదవీ విరమణ పెంపు తో ఇప్పటికే రిటైర్‌ అయిన 1,082 మంది ఉద్యోగులతో కలుపుకొని మొత్తం 43,899 వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.

పదవీ విరమణ వయసు పెంపు ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు:

– మార్చి 31 తేదీ రిటైర్‌ అయి గ్రాట్యూటీ, లీవ్‌ ఎన్‌ క్యాష్‌ మెంట్‌ తీసుకున్న ఉద్యోగులు, అధికారులు విధుల్లో చేరిన 15 రోజుల్లో ఆ సొమ్మును కంపెనీకి చెల్లించాలి.
– ఒకవేళ గ్రాట్యూటీ, లీవ్‌ ఎన్‌ క్యాష్‌మెంట్‌ సొమ్ము చెల్లించకపోతే క్యాష్‌ క్రెడిట్‌ రేట్‌ ప్రకారం వడ్డీ ని నెల నెలా జీతం నుంచి చెల్లించాల్సి ఉంటుంది. వారు 61 ఏళ్ల తర్వాత పదవీ విరమణ అనంతరం అప్పటికి వడ్డీ రూపంలో చెల్లించిన మొత్తాన్ని మినహాయించుకొని మిగిలిన సొమ్మును నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
– గ్రాట్యూటీ, ఎఫ్‌.బి.ఐ.ఎస్‌., జేపీఏఐఎస్‌, జీఐఎస్‌, లీవ్‌ ఎన్‌ క్యాష్‌మెంట్‌ లాంటి టర్మినల్‌ బెనిఫిట్లను నిబంధనల మేరకు 61 సంవత్సరాల పదవీ విరమణ తర్వాత చెల్లిస్తారు.
– పదవీ విరమణ పొంది పింఛన్‌, సీఎంపీఎఫ్‌ డబ్బు తీసుకున్న వారి విషయంలో సీఎంపీఎఫ్‌ అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి. వీటికి వేరే ఉత్తర్వులు విడుదల చేయడం జరుగుతుంది.
– మార్చి 31వ తేదీ తర్వాత రిటైర్‌ అయి చనిపోయిన వారిని కంపెనీ సర్వీసులో ఉన్నప్పుడే మరణించిన వారిగా పరిగణించి వారి కుటుంబానికి కంపెనీ ద్వారా అందే ప్రయోజనాలను అందిస్తారు.
– ఇంకా ప్రాసెస్‌ కానీ గ్రాట్యూటీ, సీఎంపీఎఫ్‌ ఇతర క్లెయిమ్‌ లను తక్షణమే ఉపసంహరించుకోవడం / రద్దు చేయడం జరుగుతుంది. ఉద్యోగి, అధికారి పదవీ విరమణ పొందిన అనంతరం ప్రాసెస్‌ చేస్తారు.
– సీపీఆర్‌ఎంఎస్‌ మెడికల్‌ కార్డు తీసుకున్న వారు వాటిని తిరిగి కంపెనీకి ఇచ్చేయాలి. రిటైర్‌ అయిన తర్వాత మళ్లీ కార్డులు జారీ చేస్తారు. దానిపై ఉన్న బ్యాలెన్సును వారు ఉపయోగించుకోవచ్చు.
– ఉద్యోగుల వేతన సవరణ జేబీసీసీఐ ఒప్పందాల ప్రకారం ఉంటుంది. అధికారుల వేతన సవరణ పీఆర్సీ / డీపీఈ నిబంధనల ప్రకారం ఉంటుంది.
– తిరిగి విధుల్లో చేరే ఉద్యోగుల సీనియారిటీ ని కాపాడటం జరుగుతుంది.

పదవీ విరమణ వయసు పెంపు ఉత్తర్వులపై సింగరేణి ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు, సింగరేణి సి అండ్‌ ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సింగరేణి ఉన్నతికి మరింత అంకిత భావంతో పనిచేస్తామని పేర్కొన్నారు.

- Advertisement -