ఇంగ్లాండ్‌పై బౌన్స్ బ్యాక్ అవుతాం!

3
- Advertisement -

ఐర్లాండ్ చేతిలో 2-0తో టీ20 సిరీస్ ఓడిపోవడం తలవంపులేమీ కాదని అయితే అది తమను ఎంతో బాధించిందని భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అంగీకరించారు. బెల్ఫాస్ట్‌లోని భిన్నమైన వాతావరణ పరిస్థితులకు అలవాటు పడటంలో విఫలమయ్యామని అన్ని విభాగాల్లోనూ ఐర్లాండ్ తమ కంటే మెరుగైన ప్రదర్శన చేసిందని ఆయన ఒప్పుకున్నారు. అయితే, ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ పూర్తిగా భిన్నమైన సవాలుతో కూడుకున్నదని.. తాము గత తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని, కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

ఐర్లాండ్ జట్టు అంత బాగా ఆడుతుందని మేము అస్సలు ఊహించలేదు. కాబట్టి ఆ ఓటమి మాకు తీవ్ర నిరాశను మిగిల్చింది. వారు అన్ని రంగాల్లో మమ్మల్ని అధిగమించారు. అక్కడి గ్రౌండ్ కొలతలు, పిచ్ ప్రవర్తించే తీరును అంచనా వేయడంలో మేము తడబడ్డాము. దానికి వారికే క్రెడిట్ ఇవ్వాలి. అయితే ఆ సిరీస్ నుండి మేము చాలా విషయాలు నేర్చుకున్నాము అని చెప్పుకొచ్చారు.

ఇంగ్లాండ్‌లో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయని…ఈసారి భారత్ మరింత పటిష్టంగా బరిలోకి దిగుతుందని శ్రేయస్ ధీమా వ్యక్తం చేశారు. మా జట్టులో చాలా మందికి ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం ఉంది. ఇక్కడి వాతావరణం, పిచ్‌లు మాకు బాగా తెలుసు. కాబట్టి ఈ సవాలుతో కూడిన సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అని తెలిపారు.

ఐర్లాండ్ సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ పెద్దగా పరుగులు చేయలేకపోయినప్పటికీ…కెప్టెన్సీ భారం తన బ్యాటింగ్‌పై పడలేదని ఆయన స్పష్టం చేశారు. “నెట్స్‌లో నేను బంతిని అద్భుతంగా టైమింగ్ చేస్తున్నాను. గత మ్యాచ్‌లో కూడా బాగానే ఆడాను, కానీ ఒక బంతి ఊహించని విధంగా బౌన్స్ అయ్యి ఇన్నర్ ఎడ్జ్ తీసుకోవడం వల్ల అవుటయ్యాను. అంతమాత్రాన నేను ఒత్తిడిలో ఉన్నానని కాదు. నా నైపుణ్యాలపై నాకు నమ్మకం ఉంది. ఒత్తిడిలో నేను ఎంత బాగా ఆడగలనో నాకు తెలుసు అని అయ్యర్ చెప్పారు.

Also Read:డిజిటల్ ఇండియా..11 ఏళ్ల ప్రస్థానం!

ఈ సిరీస్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తాడా? అనే హాట్ టాపిక్‌పై శ్రేయస్ వ్యూహాత్మకంగా స్పందించారు. టీమ్ కాంబినేషన్ అనేది చాలా రహస్యమైన విషయం ….దీనిని మేము జట్టులోనే చర్చిస్తాము. మా వ్యూహాలను ముందే బయటపెట్టి ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేము. మా చేతులు కూడా కట్టేసి ఉన్నాయి. అయితే వైభవ్ అద్భుతమైన ప్రతిభావంతుడు….అతనికి ఎప్పుడు అవకాశం వచ్చినా ఖచ్చితంగా అద్భుతంగా రాణిస్తాడు అని శ్రేయస్ అయ్యర్ ముగించారు.

- Advertisement -