కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఎమ్మెస్సార్ మృతి‌..

110
M.Satyanaraya Rao
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెస్సార్ (ఎం.సత్యనారాయణరావు) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. కరోనాతో నిమ్స్‌లో చేరిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 3.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఎమ్మెస్సార్‌కు కొవిడ్ సోకడంతో కుటుంబ సభ్యులు ఆదివారం ఆయనను నిమ్స్‌లో చేర్చారు. అక్కడాయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడమే కాకుండా మరింత క్షీణించింది. దీంతో ఈ తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఎమ్మెస్సార్‌.. 1980-83 వ‌ర‌కు ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు. 1990-94 వ‌ర‌కు ఆర్టీసీ చైర్మ‌న్‌గా ఉన్నారు. 2000-04 వ‌ర‌కు పీసీసీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 2004లో క‌రీంన‌గ‌ర్ నుంచి శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 2004-07 వ‌ర‌కు సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌ రెడ్డి మంత్రివ‌ర్గంలో మంత్రిగా ప‌నిచేశారు. 2006లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సవాల్ చేసి కరీంనగర్‌ లోక్‌సభ ఉపఎన్నికకు కారణమయ్యారు.

ఎమ్మెస్సార్‌ మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎమ్మెస్సార్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ వాదిగా, ఎంపీగా, మంత్రిగా ఎమ్మెస్సార్‌ ప్రత్యేక శైలి కనబరిచారు. రాజకీయాల్లో ఎమ్మెస్సార్‌ ముక్కుసూటి మనిషిగా పేరొందారు. ఎమ్మెస్సార్‌ మృతి పట్ల శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంతాపం తెలిపారు. ఎమ్మెస్సార్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -