సింగరేణిలో 665 ఎస్టీ బదీలీ వర్కర్ల ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక చొరవ: కవిత

224
kavitha
- Advertisement -

సింగరేణిలో ఎన్నో ఏండ్లుగా వివాదాల్లో ఉన్న 665 ఎస్టీ బదీలీ వర్కర్ల బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక చొరవ తీసుకుంటానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. ఇదే అంశంపై ఎంపీ మాలోత్ కవిత, సింగరేణి ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు టిబిజికేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత గారిని హైదరాబాద్ లో కలిసి వినతి పత్రం అందజేశారు. 2018 లో రాత పరీక్షకు హాజరైన 28,000 మంది గిరిజన యువత ఉద్యోగాల భర్తీకై ఎదురుచూస్తున్నారని, సమస్యను పరిష్కరించేందుకు త్వరలోనే సింగరేణి మేనెజ్ మెంట్ తో చర్చిస్తానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దీంతోపాటు సింగరేణి భూ నిర్వాసుతులకు సైతం కోర్టు ఆదేశాల ప్రకారం ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు.

దీనిపై సింగరేణి కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత గారికి సింగరేణి ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత గారి చొరవతో అనేక మంది గిరిజన నిర్వాసితులు మరియు నిరుద్యోగ యువత ఆకాంక్ష త్వరలోనే నెరవేరనుందని టిబిజికేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తెలిపారు.

సింగరేణి ఉద్యోగాల్లో ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇదే కోటా ప్రకారం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు 2015 లో నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే దీనిపై కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో, భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది. చివరికి 2018 లో రాత పరీక్ష నిర్వహించగా దాదాపు 28,000 మంది హాజరయ్యారు. అయితే దీనిపై కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఫలితాలను ప్రకటించలేదు. దీంతోపాటు సింగరేణి భూనిర్వాసితులు సైతం తమకు ఉద్యోగాలు కల్పించాలంటూ కోర్టుల్లో పిటిషన్ వేశారు.

- Advertisement -