మరో ఐదేళ్లలో డెబిట్ కార్డులు మాయం..!

362
- Advertisement -

విశ్వవ్యాప్తంగా ప్రస్తుతం డిజిటర్‌ ట్రెండ్‌ నడుస్తోంది. బ్యాంకు సేవలకు సంబంధించిన లావాదేవీలు ఫోన్‌తోనే జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం ఇంకా డెబిట్‌, క్రెడిట్‌ ఉపయోగిస్తున్నారు. అయితే ఇక ఈ కార్డులు తొలగించి, మరిన్ని డిజిటల్‌ చెల్లింపు విధానాలను అమల్లోకి తీసుకు రావాలని ఎస్‌బీఐ (స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) అలోచిస్తోంది. దేశంలో అయిదోవంతు జనాభాకు ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ సేవలు అందిస్తోంది. ఎస్‌బీఐ ఖాతాదార్లలో అత్యధికులు డెబిట్‌కార్డులపై ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే. అయితే మరో ఐదేళ్లలో డెబిట్ కార్డులు మాయం కానున్నాయని ఎస్‌బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ పేర్కొన్నారు.

SBI Chairman Rajnish Kumar

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్‌బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ మాట్లాడుతూ.. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి ప్లాస్టిక్ కార్డులను తొలగించాలని యోచిస్తున్నామని, ఇది సాధ్యమేనని అన్నారు. దేశంలో ప్రస్తుతం 93 కోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయన్నారు. ఎస్‌బీఐ అందుబాటులోకి తీసుకొచ్చిన యోనో వంటి డిజిటల్ యాప్ సేవలను మరింత విస్తరించడం ద్వారా కార్డుల వినియోగాన్ని తగ్గించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

యోనో యాప్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, దీని సాయంతో ఏటీఎం నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చని, కార్డుతో పనిలేకుండానే దుకాణాల్లో చెల్లింపులు చేసుకోవచ్చని వివరించారు. ప్రస్తుతం 68 వేలుగా ఉన్న యోనో కేంద్రాల సంఖ్యను మరో ఏడాదిన్నరలో పది లక్షలకు చేరుస్తామన్నారు. అప్పుడు కార్డుతో ఇక అవసరమే ఉండదని రజనీశ్ పేర్కొన్నారు. యోనో యాప్ ద్వారా కొన్ని వస్తువుల కొనుగోలుకు రుణం కూడా లభిస్తుందని, అప్పుడిక క్రెడిట్ కార్డుతో పనే ఉండదన్నారు. వచ్చే ఐదేళ్లలో కార్డు వినియోగం గణనీయంగా తగ్గుతుందని రజనీశ్ తెలిపారు.

- Advertisement -