ఈవీఎంను రిగ్గింగ్ చేయడం ఎలాగో ఢిల్లీ అసెంబ్లీలో లైవ్గా చూపించారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్ఏ సౌరభ్ భరద్వాజ్. యూపీ, ఉత్తరాఖండ్, ఢిల్లీ స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని ఆరోపించిన ఆమ్ ఆద్మీ పార్టీ… ఏకంగా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచింది.ఓ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తే చాలు ఈవీఎంలను బోల్తా కొట్టించవచ్చని భరద్వాజ్ ఈ సంధర్బంగా వెల్లడించారు. డెమోలో భాగంగా మొదట ఆయన సాధారణ మెషీన్లో ఐదు పార్టీలకు రెండేసి ఓట్లు వేయగా.. అవన్నీ సరిగ్గానే వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆయన ఓ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేశారు. తర్వాత వేసిన ఓట్లన్నీ ఒకే అభ్యర్థికి వెళ్లడాన్ని ఆయన చూపించారు. యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల్లోనూ బీజేపీకి చెందిన కార్యకర్త ఒకరు ఓటు వేయడానికంటూ వచ్చి ఈ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేశారని, ఆ తర్వాత ఓట్లన్నీ ఆ పార్టీకే పడ్డాయని భరద్వాజ్ చెప్పారు. ఓటింగ్కు ముందు రోజు మాక్ టెస్ట్లో ఈసీ అభ్యర్థులను ఫూల్స్ను చేస్తుందని ఆయన అన్నారు.
ఎమ్మెల్యే కాక ముందు పదేళ్లు కంప్యూటర్ ఇంజినీర్గా పని చేశానని చెప్పిన సౌరభ్.. దేశ ప్రజాస్వామ్యాన్ని నిర్మించే మెషిన్లను నాలాంటి ఓ చిన్న ఇంజినీర్ కూడా హ్యాక్ చేయగలగడం శోచనీయం అన్నారు. ఈ మెషిన్లను తాను కూడా రిగ్ చేయగలిగానని ఆయన చెప్పారు. డిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పాతతరం ఈవీఎంలను వాడారని, వాటిని సులువుగా ట్యాంపర్ చేయొచ్చని చెప్పారు. అందుకే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భిన్నంగా వచ్చాయన్నారు.
ఈ డెమోని తేలిగ్గా తీసుకున్న ఎన్నికల సంఘం… ఆప్ ఓ డమ్మీ ఈవీఎంపై ఈ డెమో చూపించిందని తెలిపింది.. దీన్నే ఈసీ హ్యాకథాన్ చాలెంజ్లో చేసి చూపించాలని సవాలు విసిరింది. అసెంబ్లీలో డెమో సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. సమావేశం ప్రారంభం కాగానే బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత విజయ్ గుప్తా నిరసన తెలుపగా.. స్పీకర్ ఆయనపై ఒకరోజు సస్పెన్షన్ విధించి బయటకు పంపించారు.