దంచికొట్టిన జాదవ్.. బెంగళూరు విజయం

200
Delhi Daredevils require another 157
- Advertisement -

సొంతగడ్డపై ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 15 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను మట్టికరిపించింది. 158 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి పరాజయం పాలైంది. డేర్‌డెవిల్స్‌లో రిషబ్ పంత్ (36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు) ఒంటరి పోరాటం వృథా అయింది. బెంగళూరు బౌలర్ల ధాటికి తలవంచిన డెవిల్స్ బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. ఓపెనర్లు ఆదిత్య తారే (17 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు), బిల్లింగ్స్‌ (19 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 25‌), కరుణ్‌ నాయర్‌ (4), శామ్సన్‌ (13)లు విఫలమవడంతో డేర్‌డెవిల్స్ ఓటమి మూటగట్టుకుంది.

అంతకుముందు నిప్పులు చెరిగే బంతులు విసిరిన ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్లు రాయల్ ఛాలెంజర్స్ బ్యాట్స్ మన్ భరతం పట్టారు. క్రిస్ గేల్ (6), మన్ దీప్ సింగ్ (12), కెప్టెన్ షేన్ వాట్సన్ (24), స్టువర్ట్ బిన్నీ (16), విష్ణు వినోద్ (9) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో జూలు విదిల్చాడు. అన్నీ తానై ఢిల్లీ బౌలర్లను ఆటాడుకున్నాడు. కేవలం 26 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన కేదార్ జాదవ్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. జహీర్ ఖాన్ బౌలింగ్ లో కేదార్ జాదవ్ అవుట్ కావడంతో బెంగళూరు పరుగుల ప్రవాహానికి అడ్డుకట్టపడింది. పవన్ నేగీ (10) భారీ షాట్లకు యత్నంచినప్పటికీ పెద్దగా ఫలితాన్నివ్వలేదు. చివరి బంతికి మిల్స్ (0) అవుట్ కావడంతో అబ్దుల్లా (5) నాటౌట్ గా నిలిచాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.

- Advertisement -