రాయపాటి చూపు వైసీపీ వైపు..!

474
rayapati srinivasa rao
- Advertisement -

ఎన్నికల ఫలితాలకు ముందు టీడీపీ గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత,నర్సారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సోదరుడు రాయపాటి శ్రీనివాస్ త్వరలోనే వైసీపీలో చేరనున్నారు. పార్టీ అధిష్టానంపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన జగన్‌ సమక్షంలో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

2014లో రాయపాటి సోదరులు కాంగ్రెస్‌ను వీడిన సందర్భంలో శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ గా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారట. ఐదేళ్లు గడుస్తున్న ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రాయపాటి శ్రీనివాస్ కుమారుడు, గుంటూరు మాజీ మేయ‌ర్ రాయపాటి మోహన్ సాయికృష్ణ…టీడీపీపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీనే మొదటి ముద్దాయి అని మండిపడ్డారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు రాయపాటి సోదరులు. ముఖ్యంగా రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్‌లో కీ లీడర్‌గా ఎదిగారు. కాంగ్రెస్‌ నుండి నాలుగుసార్లు ఎంపీగా,ఓ సారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీలో చేరిన ఆయన నర్సారావుపేట నుండి ఎంపీగా గెలుపొందారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన నర్సారావుపేట ఎంపీ సీటు దక్కించుకోవడానికి తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు శ్రీనివాస్ పార్టీ వీడుతారనే వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

- Advertisement -