Thursday, May 9, 2024
Home టాప్ స్టోరీస్ ఇదేం ట్విస్టు.. రేషన్ కార్డు ఉంటేనే కరెంటు !

ఇదేం ట్విస్టు.. రేషన్ కార్డు ఉంటేనే కరెంటు !

20
- Advertisement -

తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి విధితమే. ఈ ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని కుండబద్దలు కొడుతూ వచ్చారు హస్తం నేతలు. చెప్పినట్లుగానే ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమల్లోకి తీసుకొచ్చి.. మరో రెండు హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే హామీలను అమలు చేస్తున్నప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో ప్రజలందరికి చేరవేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం అవుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ ప్రకటించిన హామీలను అమల్లోకి తీసుకురావడం అంతా తేలికైన విషయం కాదనేది అందరికీ తెలిసిందే. అయినప్పటికి ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో అలివిగాని హామీలను ప్రకటించింది హస్తం పార్టీ. .

తీరా అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు ఆంక్షలు విధిస్తూ అందరికీ షాక్ షాక్ ఇస్తోంది. మొదట ఉచిత బస్సు ప్రయాణం అన్నీ ఆర్టీసీ బస్సులో ఫ్రీ అని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడేమో ఆ హామీని పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులకు మాత్రమే చేశారు. ఇప్పుడు త్వరలో అమలు చేయబోయే రూ.500 లకే వంటగ్యాస్, 200 ఉచిత కరెంటు వంటి పథకాలపై కూడా ఆంక్షలు విధించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే తెల్లరేషన్ కార్డు ఉన్నవారికే 200 యూనిట్ల కరెంటు ఇచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇక దీనితో పాటు రూ.500 లకే వంటగ్యాస్ పథకానికి కూడా  వైట్ రేషన్ కార్డ్ నే ప్రామాణికంగా తీసుకొనున్నట్లు సమాచారం. ఇప్పుడిదే రాష్ట్ర ప్రజలను కలవరపెడుతున్న అంశం. రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డ్ లేని వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో వైట్ రేషన్ కార్డు లేకపోతే పథకాలకు అర్హత ఉండదేమో భయం ప్రజలను వెంటాడుతోంది. మొత్తానికి పథకాలు ఇచ్చినట్లే ఇచ్చి  వాటికి పరిమితులు విధించడం ఏంటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి పథకాల అమలు విషయంలో మొదట్లోనే ఆంక్షలు విధిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. ఫ్యూచర్ లో ఇంకెన్ని ఆంక్షలు విధిస్తుందో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -